Maharashtra: నాందేడ్‌ ఆసుపత్రిలో మరో ఏడుగురు రోగుల మృతి

నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల సంఖ్య పెరిగింది. సోమవారం 24 మంది చనిపోగా.. అర్థరాత్రి మరో ఏడుగురు రోగులు మరణించారు.

Published : 03 Oct 2023 11:45 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి (Nanded Govt Hospital)లో మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 24 గంటల వ్యవధిలో 12 మంది శిశువులు, చిన్నారులు సహా 24 మంది రోగులు చనిపోగా.. అర్థరాత్రి మరో ఏడుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులున్నారు. దీంతో ఆస్పత్రిలో గడచిన 48 గంటల వ్యవధిలో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది. ఈ మరణాలపై విచారణ జరిపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని వేసింది. మంగళవారం మధ్యాహ్నానికి ఈ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ అంశంపై విపక్షాలు మహారాష్ట్ర సర్కారు తీరును తప్పుపట్టాయి. మరణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. 

మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్‌’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు

మరోవైపు రోగుల్లో కొందరు పాముకాటు కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి డీన్‌ శంకర్‌రావు చవాన్‌ తెలిపారు. పలువురు సిబ్బందిని బదిలీ చేయడంతో రోగులకు సేవలందించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. అలాగే, మందుల కొరతతో రోగులు మరణించినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. చాలా మంది రోగులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారని, దీనికి తోడు వైద్యం అందడంలో జాప్యం ఫలితంగా.. చికిత్సకు స్పందించే పరిస్థితి దాటిపోవడంతో మరికొంతమంది చనిపోయారని తెలిపారు. సోమవారం మృతిచెందిన 12 మంది శిశువుల్లో కొందరు వివిధ ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చిన వారున్నారు. మిగిలిన వారు పలు కారణాలతో మరణించారని మహారాష్ట్ర వైద్య విద్య, పరిశోధన విభాగం సంచాలకుడు దిలీప్‌ మైశేఖర్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని