Viral news: మెస్సీ.. మౌసీ.. వైరల్‌గా మారిన శశిథరూర్‌ ట్వీట్‌

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌ కప్‌ సంగ్రామాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ చేసిన ట్వీట్‌ ఆకట్టుకుంటోంది. దీనిపై పలువురు యూజర్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Published : 26 Nov 2022 01:51 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ నిత్యం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. సందర్భానికి అనుగుణంగా ఆసక్తికర పోస్టులు చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటారు. తాజాగా ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌ కప్‌ సంగ్రామాన్ని ఉద్దేశిస్తూ ఆయన పోస్ట్‌ చేసిన ఓ మీమ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫొటోలో ఒకవైపు స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు మెస్సీ తలపై బంతిని నిలపగా.. ఆ పక్క ఫొటోలో ఓ మహిళ ఐదు మట్టికుండలను తలపై ఎలాంటి ఆధారం లేకుండా ఒకదానిపై పేర్చారు. అంతేకాకుండా రెండు చేతుల్లో మరో నాలుగు పాత్రలు పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నట్లు ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఈ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ‘ఓ భారతీయ మహిళా నీకు జోహార్లు’ అని థరూర్‌ రాసుకొచ్చారు.

దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘ఫుట్‌బాల్‌ ఆటగాళ్ల కంటే భారత మహిళలే గొప్ప. వంటపని, ఇంటిపని, పిల్లల పెంపకం లాంటి ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబం కోసం అహర్నిశలూ శ్రమిస్తారు’’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. మీరు పంచుకున్న విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. కానీ, వాటిని అర్థం చేసుకోవాంటే పక్కన నిఘంటువు పెట్టుకోవాల్సి వస్తోంది. కొంచెం సరళంగా చెప్పొచ్చుకదా అని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు. ఆయన ట్వీట్‌పై ఇలా రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని