Narendra Modi: కుషియారా నదిపై భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య కీలక ఒప్పందం

కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత పర్యటనలో భాగంగా దిల్లీలోని

Updated : 06 Sep 2022 17:51 IST

వెల్లడించిన ప్రధాని మోదీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కుషియారా నదీజలాల పంపిణీ విషయంలో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత పర్యటనలో భాగంగా దిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంయుక్తంగా ఆ సమావేశ వివరాలను వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ‘‘భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతోంది. ఐటీ, అంతరిక్షం,అణు శక్తి రంగాల్లో మరింత సహకరించుకోవాలని నిర్ణయించుకొన్నాం. విద్యుత్తు పంపిణీ లైన్లపై చర్చలు జరుగుతున్నాయి. వరదల విపత్తు నిర్వహణలో సహకారం పెంపొందించుకొంటాము. వరదలకు సంబంధించిన రియల్‌టైమ్‌ డేటాను బంగ్లాదేశ్‌తో పంచుకొంటాము. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో 54 నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి ఇరుదేశాల ప్రజలకు జీవనాధారం. ఈ రోజు కుషియారా నదీ జలాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది’’ అని వెల్లడించారు.

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ విజయవంతంగా జరుపుకొన్న భారత ప్రభుత్వం, మిత్రులకు అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్‌  వ్యవస్థాపకుడు షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ ప్రసంగానికి సంబంధించిన పుస్తకాన్ని ప్రధాని మోదీకి ఆమె బహూకరించారు.

హసీనా తన పర్యటనలో భాగంగా నేడు రాజ్‌ఘాట్‌లోని బాపూజీ సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఆమెకు రాష్ట్రపతి భవనంలో గౌరవ వందనం సమర్పించారు. అక్కడ ఆమెకు ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎస్.జైశంకర్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హసీనా మాట్లాడుతూ ‘‘భారత్‌ను సందర్శించడం తనకెప్పుడూ సంతోషంగానే ఉంటుందన్నారు. భారత్‌ మా మిత్ర దేశం. ముఖ్యంగా మా బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించడంలో వారి సహకారం ఎన్నటికీ మరువలేనిది. మాకు స్నేహసంబంధాలు ఉన్నాయి. పరస్పరం సహకరించుకొంటాము’’ అని పేర్కొన్నారు.  ఆమె తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌తో భేటీ అయ్యారు.  బంగ్లా ప్రధాని గురువారం రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌కు వెళ్లి మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాను దర్శించే అవకాశం ఉంది. హసీనా చివరిసారిగా 2019లో భారత్‌లో పర్యటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని