Women Employees: ఏడాదిపాటు మాతృత్వ సెలవులు.. మహిళా ఉద్యోగులపై వరాల జల్లు..!

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసవిస్తే  చిన్నారుల బాగోగులను చూసేందుకు ఓ ఆయాను నియమించాలని సిక్కిం ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా మాతృత్వపు సెలవులను ఏడాదికి పెంచినట్లు ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ వెల్లడించారు.

Published : 21 Jan 2023 21:36 IST

గాంగ్‌టక్‌: సంతానోత్పత్తి (Fertility) రేటును వృద్ధి చేసేందుకు సిక్కిం ప్రభుత్వం (Sikkim Govt) చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై (Govt Women Employees) వరాల జల్లు కురిపించింది. మహిళా ఉద్యోగులకు మాతృత్వపు సెలవులను (Maternity leaves) ఏడాదికి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ (Prem Singh Tamang) వెల్లడించారు. అంతేకాకుండా మహిళా ఉద్యోగులు ప్రసవిస్తే ఏడాది పాటు చిన్నారుల బాగోగులను చూసుకునేందుకు ఇంటి వద్ద ఓ ఆయాను కూడా ప్రభుత్వమే నియమిస్తుందని చెప్పారు. దీని కోసం 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న మహిళలను రిక్రూట్‌ చేయనున్నట్లు తెలిపారు. వీరికి నెలకు రూ.10వేల భృతిని ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఉద్యోగులు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ‘‘ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అనూహ్యంగా పడిపోతోంది. దీనిని పునరుద్ధరించడానికి అన్ని చర్యలు చేపట్టాల్సిందే’’ అని సీఎం స్పష్టం చేశారు.

అంతేకాకుండా ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చే మహిళా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వనున్నట్లు సీఎం ప్రేమ్‌సింగ్‌ వెల్లడించారు. దీంతోపాటు సాధారణ ప్రజలు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కంటే..ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మరోవైపు సంతాన లేమితో బాధపడుతున్న వారికోసం ప్రభుత్వమే ఐవీఎఫ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. వాటి ద్వారా సంతానం పొందిన దంపతులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 మంది మహిళలు ఐవీఎఫ్‌ ప్రక్రియ ద్వారా సాంతానం పొందినట్లు సీఎం తెలిపారు. సిక్కింలో ప్రస్తుత జనాభా 7 లక్షల కంటే తక్కువగానే ఉంది. ఇందులో 80 శాతం మంది స్థానికులే. సంతానోత్పత్తి రేటు 1.1శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో జనాభాను వృద్ధి చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని