Sengol: ఆ డ్యాన్సర్‌ వల్లే, వెలుగులోకి రాజదండం: నిర్మలా సీతారామన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో ఇప్పుడు రాజదండం వచ్చి చేరింది. దాని గురించి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) పలు విషయాలు వెల్లడించారు. 

Updated : 25 May 2023 17:24 IST

దిల్లీ: పార్లమెంట్ కొత్త భవనంలో స్పీకర్ కుర్చీ పక్కన రాజదండం(sceptre)(సెంగోల్‌) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి అమిత్‌ షా వెల్లడించిన సంగతి తెలిసిందే. అసలు దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం వెనక ఓ డ్యాన్సర్ ఉన్నారు. ఆమే ప్రముఖ నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం(Dancer Padma Subrahmanyam). ఆమె చేసిన ఓ అభ్యర్థన వల్లే 1947 తర్వాత కనుమరుగైన రాజదండం.. ఇప్పుడు పార్లమెంట్‌లో కొలువుతీరబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను గురువారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman) మీడియాకు తెలిపారు. (New Parliament Opening)

‘స్వాతంత్ర్యం లభించిన ఆ చరిత్రాత్మక ఘడియల్లో మద్రాస్‌ రాష్ట్రం కీలక పాత్ర పోషించింది. అధికార బదిలీకి నిదర్శనంగా ఏం చేద్దామని భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. సి. రాజగోపాలాచారిని కోరారు. 8వ శతాబ్దంలో చోళుల కాలంనాటి నుంచి రాజదండం చేతుల మారడం ద్వారా అధికార మార్పిడి జరుగుతూ వచ్చిన విషయాన్ని రాజాజీ వెల్లడించారు. ఆ విధంగానే బ్రిటిషర్ల నుంచి నెహ్రూ రాజదండాన్ని అందుకున్నారు. 2021లో ఈ రాజదండం గురించి ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దానిని ప్రముఖ నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం తమిళం నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు. అలాగే అది ఎక్కడో ఉందో తెలుసుకోవాలని కోరారు. అనంతరం దానిని ప్రయాగరాజ్‌లోని ఆనంద భవన్‌ మ్యూజియంలో గుర్తించాం’ అని మంత్రి(Nirmala Sitharaman) తెలిపారు. దాని జాడ తెలుసుకునేందుకు రెండు సంవత్సరాలు పట్టింది.

ఇదీ చదవండి: కొత్త లోక్‌సభలో రాజదండం

ఇక పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో భాగంగా ఈ రాజదండాన్ని ఆవిష్కరించే ముందు జరిగే ప్రక్రియ గురించి మంత్రి వివరించారు. ఆ వేడుకకు తిరువడుత్తురై ఆధీనానికి చెందిన స్వామీజీలు కూడా హాజరుకానున్నారు. అలాగే ఈ ప్రక్రియ అంతా ద్రవిడ సంప్రదాయంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఒక స్వామీజీ శుద్ధి చేసిన రాజదండాన్ని ప్రధానికి అందజేస్తారని, ఆయన దానిని స్పీకర్ ఛైర్‌ పక్కన ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. స్వాతంత్య్ర ప్రకటన సమయంలో సెంగోల్‌ స్వీకరణ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రచురించింది. ప్రఖ్యాత టైం మేగజీన్‌తోపాటు, పలు పత్రికలు గ్రాఫిక్స్‌తో దీనిపై కథనాలు ప్రచురించాయి. దేశీయ పత్రికలు కూడా దీనికి అదే గౌరవాన్ని ఇచ్చాయి.

ఎవరీ పద్మా సుబ్రహ్మణ్యం..

ఆమె ప్రముఖ భరతనాట్య కళాకారిణి. ఆమె తండ్రి సినీ నిర్మాత కాగా.. తల్లి సంగీతకారిణి. పద్మ 14 ఏళ్ల వయస్సు నుంచే తన కళను ఇతరులకు నేర్పించడం మొదలుపెట్టారు. ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఆ క్రమంలో ఆమెను పద్మశ్రీ, పద్మభూషణ్ సహా పలు అవార్డులు వరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని