IMD: జూన్‌ 4న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు!

భారత్‌లోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం కాస్త ఆలస్యం కానుంది. జూన్‌ 4 నాటికి అవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.

Updated : 16 May 2023 18:17 IST

దిల్లీ: భారత్‌లోకి నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) రాక కాస్త ఆలస్యం కానుంది. జూన్‌ 4వ తేదీ నాటికి అవి కేరళ (Kerala) తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్‌ 4న ప్రవేశించే అవకాశం ఉందని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గతేడాది మే 29 నాటికే అవి కేరళ తీరానికి చేరుకున్నాయి. 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న ప్రవేశించాయి.

ఎల్‌ నినో (El Nino) పరిస్థితులు ఏర్పడినప్పటికీ.. భారత్‌లో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం గత నెలలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భారత్‌లో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్ల సంభవిస్తుంది. దేశ వ్యవసాయ రంగానికి ఇవి ప్రధాన ఆధారం. సాగు విస్తీర్ణంలో 52 శాతం రుతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇది దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వాటా. తద్వారా దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి కీలకమైన సహకారం లభిస్తుంది.

19 నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం: వాతావరణశాఖ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. భానుడి సెగలకు జనం అల్లాడిపోతున్నారు. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటే మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు హైదారాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. ఈనెల 19 నుంచి వేడి వాతావరణంతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించారు.

నిప్పుల కొలిమిలా మారిన ఆంధ్రప్రదేశ్‌

వాయువ్య భారత్‌ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. భానుడి ప్రతాపానికి తోడు వడగాల్పులు రాష్ట్రంలోని ఉష్ణోగ్రతల తీవ్రతను గరిష్ఠానికి చేర్చాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అన్ని ప్రాంతాల్లోనూ పగిటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. ప్రత్యేకించి కోస్తాంధ్రలోని ఉభయగోదావరి నుంచి నెల్లూరు వరకు ఉష్ణగాలుల ప్రభావం తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. అత్యధికంగా రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతంలోని ధవళేశ్వరం వద్ద 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో 46.49 డిగ్రీలు, గుంటూరు జిల్లా పొన్నూరులో 46.2, తూర్పుగోదావరి 46.06, శ్రీకాకుళం, బాపట్ల, కోనసీమ, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఏలూరులో 46 డిగ్రీల చొప్పున,  నెల్లూరు, పల్నాడు, తిరుపతి, మన్యం, నంద్యాల, విజయనగరం, పశ్చిమగోదావరి, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ దాదాపుగా 40-44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలంతా వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాగల రెండు మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు