China: చిన్న కూటములతో ప్రపంచాన్ని శాసించలేరు..!

చిన్న కూటములు కలిసి ప్రపంచాన్ని శాసించే కాలం ఎప్పుడో చెల్లిపోయిందని జి-7 దేశాలను చైనా హెచ్చరించింది.

Updated : 13 Jun 2021 15:01 IST

G7 దేశాలకు చైనా హెచ్చరిక

లండన్‌: కరోనా వైరస్‌కు కారణమైన చైనా.. వివిధ అంశాల్లో ప్రపంచదేశాలకు పెనుముప్పుగా తయారవుతోందనే అభిప్రాయం బలపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన దేశాల కూటమి ‘జి-7’ని ఉద్దేశించి చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న కూటములు కలిసి ప్రపంచాన్ని శాసించే కాలం ఎప్పుడో చెల్లిపోయిందని హెచ్చరించింది. చైనా ఆధిపత్యాన్ని ఎలాగైనా కట్డడి చేయాలని భావిస్తోన్న జి-7 దేశాలు ఆ అంశంపై చర్చిస్తున్న తరుణంలో ఈ విధంగా స్పందించింది.

‘ప్రపంచ దేశాలకు సంబంధించిన నిర్ణయాలను కేవలం కొన్ని దేశాలతో కూడిన చిన్న కూటములు నిర్దేశించే రోజులు ఎప్పుడో ముగిసిపోయాయి’ అని లండన్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. చిన్న-పెద్ద, బలమైన-బలహీనమైనా, ధనిక-పేద ఇలా అన్ని దేశాలను చైనా సమానంగానే భావిస్తుందన్నారు. అందుకే ప్రపంచదేశాలకు సంబంధించిన అంశాలపై అన్ని దేశాల సంప్రదింపులతోనే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

గతకొంత కాలంగా శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలిచేందుకు చైనా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో గత నాలుగు దశబ్దాలుగా గణనీయంగా పెరుగుతోన్న చైనా ఆర్థిక, సైనిక శక్తిపై జి-7దేశాలు దృష్టి సారించాయి. ముఖ్యంగా చైనా పెత్తనానికి ముకుతాడు వేసే ప్రత్యామ్నాయాలకోసం అమెరికా, కెనడా, బ్రిటన్‌, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌, జపాన్‌లతో కూడిన ఈ (జి-7) కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా నుంచి పొంచివున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఒక సమగ్ర వ్యూహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో జి-7 శిఖరాగ్ర సదస్సుల్లో ప్రముఖంగా ప్రస్తావించినట్లు సమాచారం. అంతేకాకుండా లక్షల కోట్ల వ్యయంతో చైనా చేపడుతోన్న ప్రాజెక్టులకు దీటుగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఓ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించుతున్నట్లు సమాచారం.

ఇలా డ్రాగన్‌ ఆధిపత్యాన్ని ఎదుర్కొనేందుకు పాశ్చాత్య దేశాలు చేస్తోన్న ప్రయత్నాలను చైనా తిప్పికొడుతోంది. తాజాగా జి-7 శిఖరాగ్ర సదస్సు జరుగుతోన్న నేపథ్యంలో కాలంచెల్లిన సామ్రాజ్యవాద మనస్తత్వాలను ఆయా దేశాలు ఇంకా పట్టుకొని వేలాడుతున్నాయని డ్రాగన్‌ దేశం విరుచుకుపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని