చైనా తిమింగలాల వేట ఇలా ..!

ఇటు కుదరకపోతే.. అటు నుంచి నరుక్కురావాలి.. ఈ సూత్రాన్ని యుద్ధాల్లో చాలా దేశాలు వాడుతుంటాయి. చైనా ఇలాంటి పథకాన్నే భారత్‌పై పన్నుతోంది. దీనికి అవసరమై ఉచ్చును కూడా పన్నుతోంది. భారత్‌ వ్యూహకర్తలకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. భారత్‌కు ఎప్పుడూ ఒక దేశంపై తొలుత యుద్ధం ప్రకటించిన చరిత్రలేదు. తనపై జరిగే

Updated : 09 Dec 2022 12:49 IST

*ప్రతివ్యూహానికి భారత్‌ పదును

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

ఇటు కుదరకపోతే.. అటు నుంచి నరుక్కురావాలి.. ఈ సూత్రాన్ని యుద్ధాల్లో చాలా దేశాలు వాడుతుంటాయి. చైనా ఇలాంటి పథకాన్నే భారత్‌పై పన్నుతోంది. దీనికి అవసరమైన ఉచ్చును కూడా బిగిస్తోంది. భారత్‌ వ్యూహకర్తలకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. భారత్‌కు ఎప్పుడూ ఒక దేశంపై తొలుత యుద్ధం ప్రకటించిన చరిత్రలేదు. తనపై జరిగే దాడుల నుంచి మాత్రం రక్షించుకొంటుంది. మరి చైనాతో పోలిస్తే సైనిక పరంగా భారత్‌ కొంత బలహీనంగా ఉంది. కానీ, వ్యూహాత్మకంగా లభించే ఆధిపత్యం భారత్‌కు ఉంది.  కఠినమైన హిమగిరుల్లో యుద్ధం చేయడం డ్రాగన్‌కు చాలా కష్టమైన పని. దానికి కీలక సరఫరాలు చేసే జీ219 హైవే అత్యంత క్లిష్టమైన మార్గంలో ఉంటుంది. దీంతో భారత దళాలు తమ దృష్టి పూర్తిగా హిమగిరులపై పెట్టకుండా చైనా సముద్రమార్గంలో దాడులను మొదలుపెడితే.. మన సైనిక వనరులను అటువైపు కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో హిమగిరుల్లో మన సైన్యం బలహీనం అవుతుంది. ఇది మన వ్యూహకర్తలు ముందే ఊహించారు. సముద్ర మార్గాల్లో జరిగే దాడుల నుంచి రక్షణ పొందేలా ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. 

భారత్‌కు ముప్పు ఇలా..

శ్రీలంకలోని హంబన్‌టోటా, పాక్‌లోని గ్వాదర్‌ పోర్టులను డ్రాగన్‌ గుప్పిట పెట్టుకొంది. భారత నావికాదళంతో పోలిస్తే చైనా దళం పెద్దది. భారత్‌ వద్ద నావికాదళంలో 2019 జూన్‌ నాటికి  67,000 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 10వేల మంది ఆఫీసర్లు. ఇక చైనాలో మొత్తం 2,35,000 మంది ఉన్నారు. మారుతున్న సముద్ర యుద్ధ తంత్రంలో సబ్‌మెరైన్లదే కీలక పాత్ర. శత్రుజలాల్లోకి చొచ్చుకుపోయి.. కీలక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తాయి. యుద్ధనౌకలను నట్టనడి సముద్రంలో ముంచేయగలవు. చైనా వద్ద మొత్తం 70 సబ్‌మెరైన్లు ఉన్నాయి. వీటిల్లో ఏడు సబ్‌మెరైన్లు అణుదాడులు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. భారత్‌ వద్ద మొత్తం సబ్‌మెరైన్ల సంఖ్యే 20లోపు ఉంది. వీటిల్లో అణుదాడి చేయగలిగేది ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ ఒక్కటే. భారత్‌ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ సబ్‌మెరైన్లు నిశ్శబ్దంగా భారత్‌ను చుట్టుముట్టి దాడి చేస్తాయి. 

చెక్‌పెట్టేది ఇలా..

ఒక్కసారిగా సబ్‌మెరైన్ల సంఖ్యను పెంచుకోవడం భారత్‌కు ఆర్థికంగా సాధ్యంకాదు. దీంతో పోల్చితే సబ్‌మెరైన్లను వేటాడే టెక్నాలజీ చౌకగా లభిస్తుంది. చైనా సబ్‌మెరైన్ల దాడి వ్యూహానికి విరుగుడుగా పనిచేస్తుంది. భారత్‌ ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో సముద్ర గస్తీని పటిష్ఠం చేసే పీ-8ఐ మారిటైమ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారత్‌ కొనుగోలు చేసింది. సముద్ర జలాల్లో నక్కిన సబ్‌మెరైన్లను పసిగట్టడంలో ప్రపంచలోనే ఇవి అత్యుత్తమమైనవి. హిందూ మహాసముద్రంలో చైనాను కట్టడి చేయడానికి అమెరికా వీటిని భారత్‌కు సమకూరుస్తోంది. దీంతోపాటు ‘ఎంహెచ్‌-60 రోమియో సీహాక్‌’ హెలికాప్టర్లను యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌గా, యాంటీ సర్ఫేస్‌ వెపన్స్‌ సిస్టంగా వాడేందుకు అమెరికా నుంచి భారత్‌ కొనుగోలు చేసింది. రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీ సహా మరికొన్ని దేశాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. హిందూ మహా సముద్రంలో ప్రత్యర్థుల జలాంతర్గాములపై నిఘా కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఈ హెలికాప్టర్లు యుద్ధనౌకలపై నుంచి సముద్రంపైకి ఎగిరి దీని మల్టీమోడ్‌ రాడార్‌తో సుదూర జలాల్లో శత్రువుల జాడను పసిగడుతుంది. 

‘స్మార్ట్‌’గా ఆలోచించి..

డీఆర్‌డీవో అత్యంత రహస్యంగా ‘సూపర్‌సోనిక్‌ మిసైల్‌ అసిస్టెడ్‌ రిలీజ్‌ ఆఫ్‌ టోర్పిడో’ (స్మార్ట్‌) ప్రాజెక్టును చేపట్టింది. సముద్ర జలాల్లో సబ్‌మెరైన్లను అంతం చేయాలంటే టోర్పిడోల వల్లే సాధ్యం. కానీ, ఇవి 50-60 కిలోమీటర్లను మించి ఎక్కువ దూరం ప్రయాణించలేవు. దీంతో డీఆర్‌డీవో వీటిని కనీసం 650 కిలోమీటర్ల అవతల లక్ష్యాలను ఛేదించేలా తీర్చిదిద్దాలని ఈ ప్రాజెక్టు చేపట్టింది. సముద్ర జలాల అడుగున వందల కిలోమీటర్లు ప్రయాణించాలంటే చాలా శక్తి, సమయం అవసరం.. అదే గాల్లో అయితే ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాకెట్‌ వ్యవస్థకు యాంటీసబ్‌మెరైన్‌ టోర్పిడోను అమర్చి ప్రయోగించేలా స్మార్ట్‌ను అభివృద్ధి చేశారు. 

సమాచారం వచ్చిన వెంటనే..

పీ-8ఐ విమానం, రోమియో హెలికాప్టర్లు శత్రు సబ్‌మెరైన్‌ను‌ గుర్తించి సమాచారాన్ని నావిక దళానికి అందిస్తాయి. గుర్తించిన ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకొని స్మార్ట్‌ను ప్రయోగిస్తే.. అది అక్కడ టోర్పిడోను వదులుతుంది. అక్కడి నుంచి టోర్పిడో నీటి అడుగున స్వల్పదూరం(దాదాపు 20 కిమీ) ప్రయాణించి శత్రులక్ష్యాన్ని నాశనం చేస్తుంది. ఇప్పడు సబ్‌మెరైన్లపై నిఘా వ్యవస్థలు, వాటిని ధ్వంసం చేసే ఆయుధాలను భారత్‌ వేగంగా అభివృద్ధి  చేస్తోంది. అమెరికా వద్ద ఇటువంటి వ్యవస్థ ఉన్నా.. అది 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ‘‘ప్రపంచంలో ప్రస్తుతం ఇటువంటి వ్యవస్థను పోలిన ఆయుధాలు ఏవీ స్మార్ట్‌కు సరిరావు. రష్యా వద్ద ఉన్న 91ఆర్‌ఈ1, 91ఆర్‌ఈటీ2, అమెరికా వద్ద ఉన్న సీలాన్స్‌, ప్లస్‌ ఆస్రోక్‌లు ఇటువంటి విధానంలోనే పనిచేస్తాయి. కానీ, ఇవేవీ 650 కిలోమీటర్ల దూరంలోని సబ్‌మెరైన్లను ధ్వంసం చేయలేవు’’ అని రక్షణ రంగ విశ్లేషకుడు సౌరవ్‌ ఝా పేర్కొన్నారు. ఇప్పటికే భారత్‌ అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ పరిధిలో బలమైన నావికాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ స్మార్ట్‌లను మోహరిస్తే.. డ్రాగన్‌ సబ్‌మెరైన్లు హిందూమహాసముద్రంలోకి రావడం చాలా కష్టతరంగా మారుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని