Smriti Irani: ఆ విషయం చెప్పడానికి నాకు 40 ఏళ్లు పట్టింది: స్మృతి ఇరానీ

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) తన గతానుభవాలు, చిన్ననాటి పరిస్థితుల గురించి తెలియజేశారు. తన తల్లిదండ్రుల గురించి స్పందించారు. 

Published : 31 Mar 2023 18:35 IST

దిల్లీ: కేంద్రమంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ(Smriti Irani) తన చిన్ననాటి పరిస్థితుల గురించి వెల్లడించారు. తన తల్లిదండ్రులు విడిపోవడం(parent’s separation) గురించి మాట్లాడారు. వారి గురించి బయటకు చెప్పడానికి తనకు 40 ఏళ్లు పట్టిందన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు స్పందించారు. 

‘నా తల్లిదండ్రులు విడిపోయిన విషయం చెప్పడానికి నాకు 40 ఏళ్లుపట్టింది. నా చిన్నతనంలో మేం ఆర్థికంగా ఇబ్బందులుపడ్డాం. మమ్మల్ని చిన్నచూపు చూసేవారు. జేబులో రూ.100తో ఓ కుటుంబాన్ని పోషించడం ఎంత కష్టమో నాకు తెలుసు. నాన్న ఒక ఆర్మీ క్లబ్‌ ముందు పుస్తకాలు అమ్మేవారు. అప్పుడు నేను ఆయనే పక్కనే కూర్చునేదాన్ని. మా అమ్మ ఇంటింటికీ తిరుగుతూ మసాలా దినుసులు విక్రయించేవారు. మా నాన్న పెద్దగా చదువుకోలేదు. మా అమ్మ అప్పట్లోనే డిగ్రీ చదివారు. దాంతో వారిద్దరిమధ్య అభిప్రాయభేదాలుండేవి. వారిద్దరి వర్గాలు వేరు. దాంతో వారికి పెద్దల నుంచి ఆమోదం లభించలేదు. వారు వివాహం చేసుకున్న సమయంలో వారివద్ద రూ.150 మాత్రమే ఉన్నాయి. మొదట్లో వారు ఒక గోవుల కొట్టంపైన గదిలో ఉండేవారు. ఆర్థికంగా, సామాజికంగా ఎదురయ్యే ఇబ్బందులు, అభిప్రాయ భేదాలను కొద్దిమంది మాత్రమే తట్టుకోగలరు’ అంటూ తన వ్యక్తిగత విషయం గురించి చెప్పారు. 

‘మా అమ్మ తన జీవితకాలంలో ఎక్కువ సమయం అద్దె ఇంట్లోనే ఉన్నారు. ఆరేళ్ల క్రితం నేను ఒక ఇంటిని కొనిచ్చాను. ఆ ఇంటికి మా అమ్మ నాకు రెంట్‌ చెల్లించేవారు. తన కుమార్తెల నుంచి  తీసుకోవడం ఆమెకు ఇష్టముండదు. అది తన ఆత్మగౌరవానికి నిదర్శనం’ అని స్మృతి(Smriti Irani)తన తల్లి గురించి గర్వంగా చెప్పారు. 

రాజకీయాల్లోకి రాకముందు నటిగా పనిచేస్తున్న సమయంలో తాను ఎదుర్కొన్న సమస్యలను స్మృతి బయటపెట్టారు. నటిగా తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ’,‘రామాయణ్‌’ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సీరియల్స్‌లో నటిస్తోన్న రోజుల్లోనే తనకు అబార్షన్‌ అయ్యిందని చెప్పారు. దాంతో తాను ఎంతో కుంగుబాటుకు గురైనట్లు తెలిపారు. షూట్‌ నుంచి కాస్త విరామం తీసుకుందామనుకున్నప్పటికీ ఇంటి ఈఎంఐలు, ఇతర ఖర్చులు గుర్తుకు వచ్చి తిరిగి సెట్స్‌కు వెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె కేంద్ర స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని