Social Media: సోషల్‌ మీడియా జవాబుదారీగా ఉండాల్సిందే : స్పష్టం చేసిన కేంద్రమంత్రి

కేంద్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ (Twitter) సిద్ధమవుతోన్న వేళ.. కేంద్ర ఐటీశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

Published : 06 Jul 2022 01:47 IST

ప్రభుత్వ ఆదేశాలను సవాలుచేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ట్విటర్‌

దిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ (Twitter) సిద్ధమవుతోన్న వేళ.. కేంద్ర ఐటీశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియా (Social Media) శక్తిమంతమైన సాధనమని.. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వీటి ప్రభావం అధికంగా ఉందన్నారు. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాలు జవాబుదారీగా ఉండాల్సిందేనని స్పష్టం చేసిన ఆయన.. ఇవి ఎలా ఉండాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు జరుగుతోందన్నారు. ఐటీ చట్టాలకు సంబంధించి భారత ప్రభుత్వ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ట్విటర్‌ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సమయంలోనే కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘సామాజిక మాధ్యమాల జవాబుదారీ అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వాటిని జవాబుదారీగా ఉంచడం ఎంతో ముఖ్యం. ఇది తొలుత స్వీయ నియంత్రణ, అనంతరం పరిశ్రమ పరంగా, చివరగా ప్రభుత నియంత్రణ ఉండాల్సిందే’ అని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు. కంపెనీ ఏదైనా.. ఏరంగానికి చెందినదైనా.. భారత చట్టాలకు లోబడే పనిచేయాలని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ చేసిన చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ఇక సామాజిక మాధ్యమాల వల్ల కంటెంట్‌ ప్రొడ్యూసర్లు ప్రయోజనం పొందుతున్నారని అనుకుంటే.. వారివల్ల మాధ్యమ వేదికలు కూడా ప్రయోజనం పొందుతున్నాయని కేంద్ర ఐటీశాఖ మంత్రి అభిప్రాయపడ్డారు.

కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన ట్విటర్‌..

డిజిటల్ మాధ్యమాల్లో కంటెంట్‌ నియంత్రణ కోసం కేంద్రం నూతన ఐటీ నిబంధనలు (IT Rules) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలు గతేడాది మే నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ఈ నిబంధనలను ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు పాటిస్తున్నప్పటికీ.. వివిధ కారణాలు చెబుతూ ట్విటర్‌ మాత్రం విముఖత చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వానికి, ట్విటర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జులై 4వ తేదీ లోగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఆదేశాలను ట్విటర్‌ పాటించాలని లేదంటే మధ్యంతర హోదా కోల్పోవాల్సి వస్తుందని భారత ప్రభుత్వం జూన్‌ నెలలో హెచ్చరించింది. దీంతో ప్రభుత్వ నిబంధనలను సవాలు చేస్తూ తాజాగా కర్ణాటక హైకోర్టును ట్విటర్‌ ఆశ్రయించింది. ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా నిరంకుశంగా ఉన్నాయని ఆరోపించింది. దీనివల్ల రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల నుంచి పోస్ట్‌ చేసిన కంటెంట్‌ను తొలగించాల్సి వస్తోందని, ఇది వాక్‌ స్వాతంత్ర్యాన్ని ఉల్లంఘించినట్లేనని ట్విటర్‌ వాదించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని