Gaganyaan: నో సాంబార్‌ ఇడ్లీ.. ఇస్రో చీఫ్‌ చెప్పిన గగన్‌యాన్‌ ముచ్చట్లు

గగన్‌యాన్‌ ప్రాజెక్టు (Gaganyaan) ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్న వ్యోమగాములకు ఎలాంటి ఆహారం ఇస్తారన్న దానిపై ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ పలు విషయాలు వెల్లడించారు.

Published : 02 Jun 2023 21:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతరిక్షంలోకి వ్యోమగాములను (Astronauts) తీసుకెళ్లాలనే లక్ష్యంతో గగన్‌యాన్‌ (Gaganyaan) ప్రాజెక్టును భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది. ఈ ఏడాది చివరినాటికి గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ ఈ మిషన్‌ను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రాజెక్టులో భాగంగా నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోని పంపనుంది. దీని కోసం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు (Indian Airforce) చెందిన నలుగురు పైలట్లకు ఇప్పటికే శిక్షణ ఇస్తోంది. అయితే, వాళ్లు అంతరిక్షంలో ఉన్నన్నాళ్లూ బలవర్ధక ఆహారం తినడం చాలా కీలకం. గ్రహానికి వెలుపల మనుగడ సాగించాలంటే అక్కడి పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా వాళ్ల ఆహారం ఉండాలి. అయితే, వాళ్లకి ఎలాంటి ఆహారం ఇస్తారన్న దానిపై ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ISRO) చీఫ్‌ సోమనాథ్‌ పలు విషయాలు పంచుకున్నారు.

నో ఇడ్లీ.. సాంబార్‌

మిషన్‌ పూర్తయ్యేంతవరకు వ్యోమగాములు భారతీయ వంటకాలనే తింటారని సోమనాథ్‌ తెలిపారు. అయితే, అందులో ఇడ్లీ, అన్నం లాంటి పదార్థాలు ఉండబోవని చెప్పారు. వ్యోమగాములకు ఎలాంటి ఆహారం ఇవ్వాలన్న దానిపై వివిధ సంస్థలు మెనూను సిద్ధం చేసే పనిలో ఉన్నాయని తెలిపారు. అయితే, తక్కువకాలం కొనసాగే మిషన్లలో గొట్టం ద్వారా తీసుకునేందుకు వీలుగా ఉండే పదార్థాలను ఉంచుతామని చెప్పారు. కానీ, సుదీర్ఘకాలం కొనసాగే మిషన్లలో మాత్రం సాధారణంగా తినే ఆహరం ఉంటుందన్నారు. వ్యోమగాముల ఎంపిక గురించి మాట్లాడుతూ.. ప్రధానంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందిని వ్యోమగాములుగా ఎంపిక చేస్తామన్నారు. ఎందుకంటే వాళ్లకు ఆయా పరిస్థితులను తట్టుకునే అనుభవం ఉంటుందని చెప్పారు. కొన్ని ప్రత్యేక టెస్టుల ద్వారా వాళ్లని ఎంపిక చేసి.. కొన్నాళ్లపాటు తర్ఫీదు ఇస్తామని తెలిపారు. గగన్‌యాన్‌కు మిషన్‌లో పాల్గొనబోతున్న వ్యోమగాములకు ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందని, కొందరికి రష్యాలోని జెనరిక్‌ స్పేస్‌ విభాగంలోనూ శిక్షణ ఇచ్చామని సోమనాథ్‌ వెల్లడించారు.

రూ.9023 కోట్ల వ్యయంతో..

దాదాపు రూ.9023 కోట్ల భారీ వ్యయంతో భారత్‌ గగన్‌యాన్‌ ప్రాజెక్టును రూపొందిస్తోంది. గతంలో ఇస్రో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టు కోసం జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 అనే రాకెట్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో సాలిడ్‌, లిక్విడ్‌, క్రయోజెనిక్‌ అనే మూడు దశలు ఉంటాయి. ఈ రాకెట్‌ భూమి నుంచి 400కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలో వ్యోమగాములను విడిచి పెడుతుంది. మూడు రోజుల పాటు వాళ్లు అంతరిక్షంలోనే ఉంటారు. ఆ తర్వాత అదే రాకెట్‌ తిరిగి వాళ్లను భూమికి చేర్చడంతో మిషన్‌ పూర్తవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని