Sharad Pawar: ‘మా ప్రభుత్వాన్ని రద్దుచేసిన మర్నాడే.. ‘వాంఖడే’లో క్రికెట్‌ మ్యాచ్‌ ఎంజాయ్‌ చేశాం’!

మత ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్లు, హనుమాన్‌ చాలీసా పఠనం వంటి వ్యవహారాలపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత,.....

Published : 26 Apr 2022 01:48 IST

అందరూ నాలా ఉండరు: మహారాష్ట్రలో పరిణామాలపై శరద్‌ పవార్‌

పుణె: మత ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్లు, హనుమాన్‌ చాలీసా పఠనం వంటి వ్యవహారాలపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ భాజపాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయాక కొందరు వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. సోమవారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవార్‌.. అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మత సంబంధ ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్ల అంశంపై మహా వికాస్‌ అఘాడీ (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి) ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. ఈ భేటీతో ఏదైనా ఫలితం వస్తే తానెంతో సంతోషిస్తానని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటూ కొందరు విపక్ష నేతలు వ్యాఖ్యలపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాన్ని చెబుతూ దీటుగా బదులిచ్చారు. 2019లో భాజపా చేతుల్లోంచి అధికారం చేజారిన తర్వాత కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారన్నారు.

అందరూ నాలా ఉండరు..

‘మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితులు కొత్త కాదు. అందరూ నాలా ఉండరు. 1980లో రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత అర్ధరాత్రి 12.30 గంటలకు నాకు ఆ విషయం చెప్పారు. అప్పుడు నాతో పాటు నా స్నేహితులు తక్షణమే ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేసే వేరే చోటకు వెళ్లిపోయాం. ఆ మరుసటి రోజే అందరం కలిసి వాంఖడే మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌కు చూసేందుకు వెళ్లాం. ఆ రోజంతా ఎంతో ఎంజాయ్‌ చేశాం’’ అని పవార్‌ చెప్పుకొచ్చారు. ‘‘అధికారం వస్తుంది.. పోతుంది.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంత కాలంగా కొందరు వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. నేను వాళ్లను నిందించడం లేదు.. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి తిరిగి వస్తామని వారు అనుకున్నారు.  కానీ అది కార్యరూపం దాల్చలేదు. అందుకే ఈ ఆందోళనంతా’’ అని భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

మధ్యంతర ఎన్నికలొస్తే.. ఇటీవలి ఫలితం చూశారుగా!

ముంబయిలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల నేపథ్యంలో భాజపా ప్రతినిధులు కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలవడంపైనా పవార్‌ స్పందించారు. కొందరు ఆతృత కలిగిన వ్యక్తులు ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారి అవకాశాలను అన్వేషించొచ్చని వ్యాఖ్యానించారు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరంలేదన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ ఎప్పట్నుంచో బెదిరిస్తున్నారనీ.. కానీ ఫలితం లేకపోయిందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల పరిస్థితి గనక వస్తే.. ఇటీవల కొల్హాపూర్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో ఏమైందో చూశాం కదా.. అందువల్ల అంతవరకు వెళ్లరని తాను అనుకొంటున్నానన్నారు. ఇటీవల కొల్హాపూర్‌ నార్త్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ మిత్రపక్షమైన కాంగ్రెస్‌ అభ్యర్థి జయశ్రీ జాదవ్‌ భాజపా అభ్యర్థి సత్యజీత్‌ కదమ్‌పై 18వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని