Omicron: ఒమిక్రాన్ భయం.. లభించని ఆ ప్రయాణికుల ఆచూకీ..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో ప్రపంచం మళ్లీ ఆంక్షల చట్రంలోకి జారుకుంటోంది. ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించగా..

Published : 05 Dec 2021 02:11 IST

దిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలంతో ప్రపంచం మళ్లీ ఆంక్షల చట్రంలోకి జారుకుంటోంది. ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించగా.. భారత్‌లోనూ ఇప్పటికే మూడు కేసులు వెలుగుచూశాయి. విదేశాల నుంచి వచ్చిన పలువురు కరోనా బారిన పడటంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన కొందరి ఆచూకీ చిక్కకపోవడం అధికారులను కలవరపెడుతోంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదవ్వగా.. తాజాగా గుజరాత్‌లోనూ ఓ కేసు వెలుగుచూసింది. విదేశాల నుంచి వచ్చినవారు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వివిధ దేశాల నుంచి వచ్చినవారిలో కొందరి ఆచూకీ లభించకపోవడం ప్రస్తుతం సమస్యగా మారింది. వీరు దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లడంతో స్థానికంగా వైరస్‌ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు చేరుకున్న 300 మంది ప్రయాణికుల్లో 13 మంది జాడ తెలుసుకోవడం అధికారులకు సవాలుగా మారింది. వారు తప్పుడు చిరునామా, ఫోన్‌ నెంబర్లు ఇవ్వడమే అందుకు కారణమని అధికారులు తెలిపారు. వారిలో ఏడుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు వారు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళ.. క్వారంటైన్ నిబంధనను ఉల్లంఘించడంతో చండీగఢ్‌ యంత్రాంగం ఆమెపై కేసు నమోదు చేసింది. విమానాశ్రయంలో దిగిన ఆమెకు కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ అని తేలింది. వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆమెకు అధికారులు సూచించినా.. ఆమె నేరుగా హోటల్‌కు వెళ్లడంతో కేసు నమోదైంది. 

బెంగళూరులో.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన దాదాపు 10 మంది ప్రయాణికుల జాడ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. దిల్లీ ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో 12 మంది ఒమిక్రాన్‌ అనుమానితులు చేరగా.. వీరంతా ముప్పు జాబితాలోని దేశాల నుంచి ఇటీవల భారత్‌కు చేరుకున్నట్టు తెలిసింది. జైపుర్‌లోని ఓ కుటుంబంలో 9 మందికి కరోనా సోకింది. వారిలో నలుగురు దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారే. దిల్లీ, ముంబయి, చండీగఢ్‌లో.. గడిచిన వారం రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో దాదాపు 18 మందికి పాజిటివ్‌గా తేలింది. వారంతా విదేశాల నుంచి భారత్‌కు చేరుకోవడంతో.. వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు అధికారులు వెల్లడించారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని