Hyundai: హ్యుందాయ్‌ ‘కశ్మీర్‌’ ట్వీట్‌ వివాదం.. దక్షిణ కొరియా ప్రభుత్వం ఏమందంటే..?

ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ (Hyundai)కు చెందిన పాకిస్థాన్‌ డీలర్‌.. ‘కశ్మీర్‌’ వ్యవహారంపై సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో ఆ సంస్థ పెను వివాదంలో

Published : 09 Feb 2022 01:56 IST

కొరియా రాయబారికి కేంద్రం సమన్లు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ హ్యుందాయ్‌ (Hyundai)కు చెందిన పాకిస్థాన్‌ డీలర్‌.. ‘కశ్మీర్‌’ వ్యవహారంపై సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్‌తో ఆ సంస్థ పెను వివాదంలో చిక్కుకుంది. దీనిపై ఇప్పటికే స్పందించిన హ్యుందాయ్‌.. భారత ప్రజలను ఇబ్బందులకు గురిచేసినందుకుగానూ చింతిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ వివాదంపై ఆ కంపెనీ సొంత దేశమైన దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు హ్యుందాయ్‌ వివాదంపై దక్షిణకొరియా విదేశాంగ మంత్రి.. భారత విదేశాంగ మంత్రితో మాట్లాడి విచారం తెలిపినట్లు కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చీ వెల్లడించారు. మరోవైపు ఈ వ్యవహారంపై భారత్‌లోని దక్షిణ కొరియా రాయబారికి సమన్లు కూడా జారీ అయ్యాయి.

‘‘హ్యుందాయ్‌ పాకిస్థాన్‌ పేరుతో ఉన్న ఖాతాలో కశ్మీర్‌ను ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్‌ మా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్‌ను చూసిన వెంటనే గత ఆదివారం సియోల్‌(దక్షిణ కొరియా)లోని మన రాయబారి హ్యుందాయ్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్లి వివరణ కోరారు. ఆ వెంటనే సోషల్‌మీడియా నుంచి పోస్ట్‌ను డిలీట్‌ చేయించారు. సోమవారం రిపబ్లిక్ ఆఫ్‌ కొరియా భారత రాయబారికి.. కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. సోషల్‌మీడియాలో వచ్చిన అనుచితపోస్టుపై భారత్‌ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.  దేశ భౌగోళిక సమగ్రతకు సంబంధించి విషయాల్లో రాజీపడేది లేదని గట్టిగా స్పష్టం చేశాం. దీనిపై కంపెనీ తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’’ అని అరీందమ్‌ బాగ్చీ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ ఉదయం దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్‌ ఇయ్‌ యాంగ్‌.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోన్‌ కాల్‌ ద్వారా మాట్లాడినట్లు బాగ్చీ తెలిపారు. అనేక అంశాలతో పాటు హ్యుందాయ్‌ వివాదం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు చెప్పారు. ఆ సోషల్‌మీడియా పోస్ట్‌ కారణంగా భారత ప్రభుత్వం, ప్రజలకు కలిగిన ఇబ్బందికి కొరియా మంత్రి విచారం వ్యక్తం చేసినట్లు బాగ్చీ పేర్కొన్నారు. ‘‘పలు రంగాల్లో విదేశీ కంపెనీల పెట్టుబడులను భారత్‌ స్వాగతిస్తుంది. అయితే దేశ భౌగోళిక సమగ్రత, సౌభ్రాతృత్వానికి సంబంధించిన అంశాలపై దుష్ప్రచారం చేయకుండా ఆ కంపెనీలు జాగ్రత్తగా ఉండాలి’’ అని కేంద్ర విదేశాంగ శాఖ సూచించింది. 

ఈ వివాదంపై హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా నేడు మరోసారి ప్రకటన విడుదల చేసింది. పాక్‌లోని హ్యుందాయ్‌ స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే ఆ అనధికారిక పోస్ట్‌ కారణంగా దేశ ప్రజలను బాధపెట్టినందుకు చింతిస్తున్నట్లు తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని