SpaceX: భూకక్ష్యలోకి సామాన్యులు.. స్పేస్‌ఎక్స్‌ తొలి పౌర అంతరిక్షయానం

అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ అరుదైన ఘనత సాధించింది. అంతరిక్ష పర్యాటకాన్ని వృద్ధి చేయడమే లక్ష్యంగా తొలి పౌర

Published : 16 Sep 2021 11:02 IST

కేప్‌ కానావెరల్‌(యూఎస్‌): అమెరికాకు చెందిన దిగ్గజ ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ అరుదైన ఘనత సాధించింది. అంతరిక్ష పర్యాటకాన్ని వృద్ధి చేయడమే లక్ష్యంగా తొలి పౌర అంతరిక్షయానాన్ని చేపట్టింది. నలుగురు సామాన్యులతో కూడిన వాహకనౌకను నింగిలోకి పంపింది. వీరు మూడు రోజుల పాటు భూకక్ష్యలో ప్రయాణించనున్నారు. ప్రొఫెషనల్‌ వ్యోమగాములు కాకుండా.. సామాన్య పౌరులతో కూడిన ఓ ప్రైవేటు వాహకనౌక భూకక్ష్యలో ప్రయాణించడం ఇదే తొలిసారి. 

‘స్పేస్‌ఎక్స్‌ - ఇన్‌స్పిరేషన్‌ 4’ పేరుతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 8.02 గంటల ప్రాంతంలో ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 12 నిమిషాల తర్వాత డ్రాగన్‌ కాప్సుల్‌ రాకెట్‌ నుంచి వేరవడంతో వాహకనౌక భూకక్ష్యలోకి చేరింది. ఈ ప్రాజెక్టు విజయవంతమైందని, నిర్దేశిత మార్గంలో వెళ్లిన రాకెట్‌.. ప్రయాణికులను భూకక్ష్యలోకి తీసుకెళ్లిందని స్పేస్‌ఎక్స్‌ ప్రకటించింది. వీరంతా మూడు రోజుల పాటు భూమి చుట్టూ ప్రయాణించి.. తిరుగు ప్రయాణమవుతారని తెలిపింది. 

అంతరిక్ష పర్యాటకంలో స్పేస్‌ఎక్స్‌ తొలి ప్రయోగం ఇదే అయినప్పటికీ.. అరుదైన రికార్డు నెలకొల్పింది. స్పేస్‌ఎక్స్‌ కంటే ముందు వర్జిన్‌ గెలాక్టిక్‌, బ్లూ ఆర్జిన్‌ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటకాన్ని ప్రారంభించాయి. బ్లూ ఆర్జిన్‌లో ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్‌ కూడా ప్రయాణించారు. అంతకుముందు వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రయోగించిన వాహకనౌకలో ఆ సంస్థ అధినేత రిచర్డ్‌ బ్రాన్‌సన్‌తో పాటు కంపెనీకి చెందిన మరో ముగ్గురు అధికారులు అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే వీరంతా అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ(ఐఎస్‌ఎస్‌) వరకే వెళ్లారు. కొద్దిసేపు అంతరిక్షంలో గడిపి తిరిగొచ్చారు. కానీ స్పేస్‌ఎక్స్‌ ప్రయోగించిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ఈ ఐఎస్‌ఎస్‌ను దాటి భూకక్ష్య వరకు వెళ్లింది. స్పేస్‌ ఎక్స్‌ ఇలా భూకక్ష్యలోకి సామాన్య పౌరులను తీసుకెళ్లడం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకం. 

ఎవరా నలుగురు..

ఫాల్కన్‌ 9 రాకెట్‌లో మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణించారు. వీరిలో ఒకరు ఈ ప్రాజెక్టుకు రిచ్‌ స్పాన్సరర్‌ అయిన బిలియనీర్‌ 38ఏళ్ల జారెద్‌ ఇజాక్‌మన్‌. ఈయన ఈ రాకెట్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయనతో పాటు 29ఏళ్ల హేలీ ఆర్సెనాక్స్‌, 42 ఏళ్ల క్రిస్‌ సెంబ్రోస్కీ, 51ఏళ్ల సియాన్ ప్రాక్టర్‌ ఉన్నారు. అమెరికాలోని లూసియానకు చెందిన హలీ.. చిన్న వయసులోనే ఎముక క్యాన్సర్‌ను జయించింది. తనలాంటివారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఫిజీషియన్‌ అసిస్టెంట్‌ కోర్సును పూర్తి చేసి.. ప్రస్తుతం క్యాన్సర్‌ బాధితులకు సేవలందిస్తోంది. ఇక క్రిస్‌.. వాషింగ్టన్‌లో డేటా ఇంజినీర్‌గా పనిచేస్తుండగా.. సియాన్ ప్రాక్టర్‌ అరిజోనాలో కమ్యూనిటీ కాలేజీ ఎడ్యుకేటర్‌గా వ్యవహరిస్తున్నారు. 




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని