SSC GD2022: దరఖాస్తుకు నేడే ఆఖరు.. SSC వెబ్‌సైట్‌ మొరాయింపుతో అభ్యర్థుల్లో ఆందోళన!

కేంద్ర సాయుధ బలగాల్లో 24,369కానిస్టేబుల్‌/రైఫిల్‌మ్యాన్‌/సిపాయి పోస్టుల భర్తీ కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఇటీవల భారీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తున్నాయంటూ పలువురు అభ్యర్థులు వాపోతున్నారు.

Updated : 30 Nov 2022 20:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర సాయుధ బలగాల్లో 24,369కానిస్టేబుల్‌/రైఫిల్‌మ్యాన్‌/సిపాయి పోస్టుల భర్తీ కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC GD2022 notification) ఇటీవల భారీ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయంటూ పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. దరఖాస్తు సమర్పణకు బుధవారమే (నవంబర్‌ 30) ఆఖరు గడువు కావడంతో సర్వర్‌ పనిచేయడంలేదంటూ తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందువల్ల దరఖాస్తు చేసుకొనేందుకు గడువును పెంచాలని అధికారులను కోరుతూ ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. దాదాపు వారం రోజులుగా వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసేందుకు ప్రయత్నిస్తున్నా కావడంలేదంటూ కొందరు పేర్కొంటుండగా.. మూడు నాలుగు రోజుల నుంచి సర్వర్‌ మొరాయిస్తోందంటూ మరికొందరు చెబుతున్నారు.  

‘ఎస్‌ఎస్‌సీ జీడీ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు వెబ్‌సైట్‌ గత ఏడు రోజులుగా పనిచేయడంలేదు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు గడువు పెంచండి’ అని కోరుతూ లఖన్‌ సింగ్‌ సోలంకి అనే వ్యక్తి తనకు ఎదురైన సాంకేతిక లోపాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే, ‘‘దరఖాస్తు సబ్‌మిట్‌ చేసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నా.. అవ్వట్లేదు’ అంటూ సుజీత్‌ కుమార్‌ అనే వ్యక్తి వాపోయారు. గత ఐదు రోజులుగా ఈ వెబ్‌సైట్‌ సరిగా పనిచేయడంలేదని వికాశ్‌ మిశ్రా అనే వ్యక్తి పేర్కొన్నారు. ఇది అనేకమంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశం కావడంతో రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించాలని కోరారు. ఇలా అనేక మంది ట్వీట్లు చేస్తూ తమ ఆవేదన తెలుపుతున్నారు. 

ఎస్‌ఎస్‌సీ విడుదల చేసిన ఈ భారీ నోటిఫికేషన్‌ ద్వారా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్ (ఏఆర్‌)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)లో సిపాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తదితర పరీక్షల ద్వారా ఎంపికచేస్తారు. ఈ పరీక్షను ఈ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 10 నుంచిఫిబ్రవరి 14 వరకు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పోటీపడే ఈ పరీక్షకు అక్టోబర్‌  27నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే.







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని