Corona: రెండోడోసు ఇవ్వడంపై దృష్టి పెట్టండి

వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, వృద్ధులకు కరోనా రెండో డోసు ఇవ్వడంపై దృష్టి సారించాలని కేంద్రం శుక్రవారం రాష్ట్రాలను కోరింది.

Published : 12 Jun 2021 01:38 IST

రాష్ట్రాలకు కేంద్రం విజ్ఞప్తి

81.8 శాతం నుంచి 95 శాతానికి చేరిన రికవరీ రేటు

దిల్లీ: వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, వృద్ధులకు కరోనా రెండో డోసు ఇవ్వడంపై దృష్టి సారించాలని కేంద్రం శుక్రవారం రాష్ట్రాలను కోరింది. మొదటి డోసును ఇవ్వడంలో రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు మంచి పనితీరును కనబరిచాయని గుర్తుచేసింది. అయితే సకాలంలో రెండో డోసు అందించడం ఆవశ్యకమని స్పష్టం చేసింది. అలాగే ప్రతి రాష్ట్రంలో సీరో సర్వే నిర్వహించాలని ఆయా ప్రభుత్వాలకు సూచించింది. మరోపక్క దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తుందని చెప్పిన కేంద్రం.. ప్రజలు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో ఆరోగ్యశాఖ పలు వివరాలు వెల్లడించింది. 

మే 7 నుంచి తగ్గుతున్న కేసులు..

దేశంలో కరోనా కేసులు మే 7న రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకు పైగా నమోదయ్యాయి. ఆ రోజున గరిష్ఠ స్థాయికి చేరిన కేసులు.. తరవాతి రోజు నుంచి తగ్గుముఖం పట్టాయి. స్వల్ప హెచ్చుతగ్గులతో నాలుగు రోజులుగా లక్షకు దిగువనే వెలుగుచూస్తున్నాయి. గురువారం 91వేల మంది కరోనా బారిన పడ్డారు. అలాగే 15 రాష్ట్రాల్లో వారపు సగటు పాజిటివిటీ రేటు 5 శాతానికి దిగువనే ఉంటుందని ఆరోగ్య శాఖ తెలిపింది. గత 29 రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉంటున్నాయి. మే ప్రారంభంలో 81.8 శాతానికి పడిపోయిన రికవరీ రేటు..ప్రస్తుతం 94.9 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 2.77 కోట్ల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు. 11లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. 

24.61 కోట్ల టీకా డోసుల పంపిణీ...

కరోనా టీకా డోసుల పంపిణీ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24.6 కోట్ల డోసులు పంపిణీ జరిగింది. 19.58 కోట్ల మంది మొదటి డోసును స్వీకరించగా..4.76 కోట్ల మందికి రెండో డోసు అందిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు