కరోనా కొత్త రకాల ప్రభావం ఎలా ఉందంటే..!

మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో డబుల్‌ మ్యుటెంట్‌ రకం ప్రాబల్యం ఎక్కువగా ఉందని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) పేర్కొంది.

Published : 07 May 2021 01:53 IST

ఎన్‌సీడీసీ వెల్లడి

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి వేళ పలు రాష్ట్రాల్లో కొత్త రకం కరోనా వైరస్‌ల ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఆయా రాష్ట్రాల్లో వీటి ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో యూకే రకం ప్రభావం అధికంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో డబుల్‌ మ్యుటెంట్‌ రకం ప్రాబల్యం ఎక్కువగా ఉందని జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) పేర్కొంది.

యూకే రకం ఈ రాష్ట్రాల్లోనే అధికం..

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18,053 నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టామని ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ సుజీత్‌ సింగ్‌ వెల్లడించారు. భారత్‌లో B1.1.7గా పిలుస్తోన్న యూకే రకం ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ గత నెలన్నర నుంచి చాలా ప్రాంతాల్లో వీటి విస్తృతి తగ్గినట్లు తెలిపారు. పంజాబ్‌ (482 శాంపిళ్లు), దిల్లీ (516), తెలంగాణ (192), మహారాష్ట్ర (83), కర్ణాటక (82) రాష్ట్రాల్లో యూకే రకం ప్రభావం అధికంగా ఉన్నట్లు సుజీత్‌ సింగ్‌ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నామని ఎన్‌సీడీసీ చీఫ్‌ వెల్లడించారు. ఫిబ్రవరిలో రెండుసార్లు, మార్చిలో నాలుగుసార్లు, ఏప్రిల్‌ నెలలో నాలుగు సార్లు వీటికి సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్రాలతో పంచుకున్నట్లు తెలిపారు.

డబుల్‌ మ్యుటెంట్‌ ఎక్కడెక్కడ అంటే..

ఇక B.1.617గా పిలిచే డబుల్‌ మ్యుటెంట్‌ వైరస్‌ ప్రభావం మహారాష్ట్రలో అధికంగా ఉందని ఎన్‌సీడీసీ పేర్కొంది. మహారాష్ట్ర (761 శాంపిళ్లు)తో పాటు పశ్చిమబెంగాల్‌ (124), దిల్లీ (107), గుజరాత్‌ (102) రాష్ట్రాల్లో డబుల్‌ మ్యుటెంట్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలిపింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త రకం కరోనా(B.1.315) ప్రభావం తెలంగాణ, దిల్లీ రాష్ట్రాల్లో కనిపించిందని ఎన్‌సీడీసీ వెల్లడించింది. ఇక బ్రెజిల్‌ రకం (P1) మాత్రం మహారాష్ట్రలో స్వల్పంగానే ఉన్నట్లు ఎన్‌సీడీసీ తెలిపింది.

మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే..!

కొత్తరకాలు వెలుగుచూస్తోన్న వేళ రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎన్‌సీడీసీ చీఫ్‌ హెచ్చరించారు. వీటి ప్రభావం ఉన్న జిల్లాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ భారీ స్థాయిలో చేపట్టడంతో పాటు, విదేశాల నుంచి వచ్చిన వారి శాంపిళ్లకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టే చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు. వీటి తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు మరింత శ్రద్ధ చూపాలని ఎన్‌సీడీసీతోపాటు కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు నొక్కిచెప్పాయని సుజీత్‌ సింగ్‌ గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని