Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా సరిహద్దుల్లో 600 మంది భారత విద్యార్థులు..

కల్లోలిత ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్‌

Published : 03 Mar 2022 01:44 IST

తరలింపు కోసం ఎదురుచూపులు

ఇంటర్నెట్‌డెస్క్‌: కల్లోలిత ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేయడంతో పొరుగు దేశాలైనా రొమేనియా, హంగరీ, పోలండ్‌ నుంచి విమానాలు నడుపుతోంది. అయితే ఈశాన్య ఉక్రెయిన్‌లోని రష్యా సరిహద్దులకు సమీపంలో 600 మందికి పైగా భారతీయులు చిక్కుకుపోయినట్లు తాజాగా తెలిసింది. 

ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో గల ఓ యూనివర్శిటీలో చదువుతున్న వీరంతా ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారు. ఈ యూనివర్శిటీ రష్యా సరిహద్దుకు అత్యంత సమీపంలోని ఉంది. ఇప్పటివరకు అక్కడి నుంచి ఒక్క విద్యార్థిని కూడా స్వదేశానికి తరలించలేదని, తామంతా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. 

‘‘సుమీ యూనివర్శిటీలో 600లకు పైగా భారత విద్యార్థులు చిక్కుకుపోయారు. రష్యా దురాక్రమణకు ముందు మమ్మల్ని స్వదేశానికి వెళ్లిపోవాలని అడ్వైజరీలు జారీ అయ్యాయి. కానీ పరీక్షలు ఉన్నవారు ఇక్కడే ఉండాలని యూనివర్శిటీ చెప్పింది. దీంతో మేం ఇక్కడే ఉండాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. గత ఐదు రోజులుగా బాంబులు, షెల్లింగ్ల శబ్దాలతో వణికిపోతున్నాం. మానసికంగా కుంగిపోతున్నాం. ఆహారం, నీళ్లు కూడా దొరకట్లేదు. ఏటీఎంలలో డబ్బులు అయిపోయాయి’’ అని ఈ యూనివర్శిటీలో చదువుతున్న మహారాష్ట్ర విద్యార్థి విరాజ్‌ వాల్దే ఫోన్లో పీటీఐకి తెలిపారు. 

ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ తమను స్వదేశానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించట్లేదని విరాజ్‌ ఆరోపించారు. ‘‘భారత విద్యార్థులంతా కేవలం ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దులను ఉపయోగించుకుని పోలాండ్‌, హంగరీ, రొమేనియా దేశాలకు రావాలని ఎంబసీ అడ్వైజరీలు జారీ చేసింది. కానీ సుమీ నగరం ఈశాన్య ఉక్రెయిన్‌లో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడి నుంచి పశ్చిమ సరిహద్దులకు రావడం అనేది అసాధ్యం. పశ్చిమ సరిహద్దులకు వెళ్లాలంటే 1500 కిలోమీటర్లు ప్రయాణించాలి’’ అని సదరు విద్యార్థి తెలిపారు. అందువల్ల తమను రష్యా మీదుగా భారత్‌కు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ఇదిలా ఉండగా.. సుమీ నగరంలోని భారత విద్యార్థులను రష్యా మీదుగా స్వదేశానికి తరలించే అంశాన్ని రష్యా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని