Mann Ki Baat: వ్యాక్సినేషన్‌ విజయవంతం.. కొత్త ఉత్సాహంలో దేశం

‘100 కోట్ల డోసులు పూర్తయిన క్రమంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమ సఫలతా మన దేశ సామర్థ్యాన్ని చూపుతోంది. ప్రతి ఒక్కరి ప్రయత్నాల ఫలితాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఆరోగ్య కార్తకర్తల కృషితో ఇది సాధ్యమైంది’ అంటూ...

Updated : 24 Oct 2021 15:22 IST

‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: ‘100 కోట్ల డోసులు పూర్తయిన క్రమంలో దేశం సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమ సఫలత మన దేశ సామర్థ్యాన్ని చూపుతోంది. ప్రతి ఒక్కరి ప్రయత్నాల ఫలితాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. ఆరోగ్య కార్తకర్తల కృషితో ఇది సాధ్యమైంది’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రధాని ‘మన్ కీ బాత్’ 82వ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతమైందని ప్రశంసించారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌కు చెందిన ఆరోగ్య కార్యకర్త పూనమ్ నౌటియాల్‌తో సంభాషించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఆమె అనుభవాలు, ఎదురైన సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

* అక్టోబర్ 31న ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభభాయ్‌ పటేల్ జయంతి పురస్కరించుకుని.. ఆయనకు నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశభక్తి, ఐక్యత విషయంలో పటేల్ నుంచి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

* వచ్చే నెలలో ఝార్ఖండ్‌కు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా జయంతినీ ప్రస్తావిస్తూ.. ఆయనకూ నివాళులర్పించారు. స్థానిక సంస్కృతిపై గర్వపడటం, పర్యావరణంపై శ్రద్ధ వహించడం, అన్యాయంపై పోరాడటం వంటి లక్షణాలను ఆయన జీవితం మనకు నేర్పిందని కొనియాడారు.

* ప్రపంచ శాంతి పరిరక్షణకు భారత్‌ విశేష సహకారం అందజేస్తోందని ప్రధాని అన్నారు. ఐరాస దినోత్సవం పురస్కరించుకుని.. ఐరాస శాంతి పరిరక్షణ దళాలకు భారత్‌ అందిస్తోన్న తోడ్పాటును ప్రస్తావించారు. భారత్‌.. ఎల్లప్పుడూ ప్రపంచ శాంతికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

* దేశ పోలీసు వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగిందని ప్రధాని మోదీ వెల్లడించారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గణాంకాల ప్రకారం.. కొన్నేళ్లుగా పోలీసు శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య రెట్టింపు అయినట్లు తేలిందన్నారు. మహిళా సిబ్బంది.. నేటి యువతులకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

* దేశంలో పెరుగుతున్న డ్రోన్ల ప్రాధాన్యంపై మాట్లాడుతూ.. యువత దృష్టిని ఇవి ఎక్కువగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు. అంకుర సంస్థలు కూడ వాటిని వినియోగిస్తున్నాయని చెప్పారు. గతంలో డ్రోన్ల రంగం అనేక ఆంక్షలు, నిబంధనలతో ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, కొత్త డ్రోన్ పాలసీ..ఇప్పటికే మంచి ఫలితాలను చూపుతోందన్నారు.

* స్వచ్ఛ భారత్‌ అంశంపై మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేయాలని మరోసారి పిలుపునిచ్చారు. దీపావళికి ఇళ్లను శుభ్రపరిచే క్రమంలో, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అందరం కలిసి దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతామంటూ ప్రతిజ్ఞ చేద్దామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని