Death Penalty: ‘ఉరి’ విధానం క్రూరమైందా..? సుప్రీంకోర్టు ఏమంటోంది..!

దేశంలో మరణశిక్ష (Death Penalty) అమలుకు అనుసరిస్తున్న ఉరితీసే (Hanging) విధానం అత్యంత క్రూరమైందని.. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) పిటిషన్‌ దాఖలయ్యింది. దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం.. ఉరి తీయడం అత్యంత అనుకూలమైన, నొప్పిలేని విధానమని చెప్పడానికి ఏదైనా సమాచారం ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Published : 22 Mar 2023 00:19 IST

దిల్లీ: మరణశిక్ష (Death Penalty) పడిన ఖైదీలను ఉరితీసే (Hanging) పద్ధతి సరైనదేనా..? ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా..? అనే అంశాల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు అవసరమని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) అభిప్రాయపడింది. ఉరి అమలు వలన కలిగే బాధ, ప్రభావానికి సంబంధించి ఏమైనా సమాచారం లేదా అధ్యయనం ఉందా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరింత గౌరవప్రదంగా, తక్కువ నొప్పి, సమాజం అంగీకరించే విధానాలను పరిశీలించేందుకు విస్తృత సమాచారం అవసరమని.. తద్వారా ‘ఉరి’ పద్ధతి అమలుపై ఓ నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుందని తెలిపింది.

‘ఉరిశిక్ష పద్ధతిని పునఃపరిశీలించాలంటే మనకు మరింత సమాచారం అవసరం. ఉరివేయడం వల్ల కలిగే ప్రభావం, బాధ, మరణానికి పట్టే సమయం, ఉరితీసేందుకు ఉన్న వసతులకు సంబంధించి పూర్తి సమాచారం కావాలి’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా గౌరవప్రదంగా మరణశిక్ష అమలుకు శాస్త్రసాంకేతిక రంగంలో ఎలాంటి పురోగతి వచ్చిందో అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన సుప్రీం ధర్మాసనం.. అందులో జాతీయ న్యాయ యూనివర్సిటీలు, న్యాయ ప్రొఫెసర్లు, వైద్యులు, శాస్త్రీయ నిపుణులు ఉండాలన్నారు.

మరణశిక్ష అమలులో ఉరితీసే పద్ధతికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అమెరికాలో ప్రాణాంతకమైన ఇంజక్షన్‌ ద్వారా అమలు చేస్తున్న మరణశిక్షతో పోలిస్తే ఉరి తీయడమనేది అత్యంత క్రూరమైన, దారుణమైన విధానమని అందులో పేర్కొన్నారు. అందుకే మానవీయ, గౌరవప్రదమైన మార్గంలో ప్రత్యామ్నాయాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం.. ఉరిశిక్ష అమలుకు మానవీయ పద్ధతుల్లో ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాలను పరిశీలించడానికి మరింత అంతర్లీన సమాచారం అవసరమని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి సూచించింది. తదుపరి విచారణను మే 2కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని