Supreme Court: ‘ఉబర్‌.. ర్యాపిడో’పై మీరేమంటారు? కేంద్రాన్ని అభిప్రాయమడిగిన సుప్రీం!

బైక్‌ ట్యాక్సీ సేవలను దిల్లీ ప్రభుత్వం నిషేధించగా.. హైకోర్టు దీనిపై స్టే విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు లో దిల్లీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీంకోర్టు కోరింది.

Published : 09 Jun 2023 18:55 IST

దిల్లీ: దేశ రాజధానిలో ఉబర్‌ (uber).. ర్యాపిడో (rapido) వంటి బైక్ ట్యాక్సీల నిషేధం వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ కూడా అభిప్రాయం తెలపాలని కోరింది. ఈ మేరకు కేసుకు సంబంధించిన పిటిషన్లను సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు అందజేస్తున్నట్లు కోర్టు తెలిపింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైందంటే.. 

దిల్లీ (delhi)లో ఉబర్‌.. ర్యాపిడో వంటి బైక్‌ ట్యాక్సీ అగ్రిగేటర్లపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. నాన్‌-ట్రాన్స్‌పోర్ట్‌ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న ద్విచక్ర వాహనాలను ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉపయోగించడాన్ని తప్పుపట్టింది. వాణిజ్య కార్యకలాపాలకు ద్విచక్రవాహనాన్ని ఉపయోగించడం.. మోటారు వాహన చట్టం(1988 )ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఉబర్‌.. ర్యాపిడో హైకోర్టును ఆశ్రయించగా.. దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై కోర్టు స్టే విధించింది. ఈ అంశంలో పూర్తిస్థాయిలో ఓ విధానం రూపొందించే వరకు బైక్‌ ట్యాక్సీ సేవలను కొనసాగించడానికి అనుమతిచ్చింది. 

హైకోర్టు విధించిన స్టేను సవాల్‌ చేస్తూ దిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ అనిరుధ బోస్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌తో కూడిన వెకేషన్‌ బెంచ్‌.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరువర్గాల పిటిషన్లను సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు అందజేయాలని కోర్టు సిబ్బందికి సూచించింది. వాటిని పరిశీలించి కేంద్రం తమ అభిప్రాయం తెలియజేస్తే.. దానిని పరిగణనలోకి తీసుకొని విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని