Odisha Train Tragedy: 250 మంది ప్రయాణికులతో చెన్నైకి ప్రత్యేకరైలు

ఒడిశా రైలు ప్రమాద ఘటనలో (Odisha Train Tragedy) క్షేమంగా బయటపడిన వాళ్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. భద్రక్‌ నుంచి చెన్నైకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలిస్తున్నారు.

Published : 03 Jun 2023 17:25 IST

భువనేశ్వర్‌: ఒడిశా రైలు ప్రమాద ఘటనలో క్షేమంగా బయటపడిన 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నై తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు నెంబర్‌ P/13671 రైలు భద్రక్‌ స్టేషన్ నుంచి బయల్దేరి.. బహనాగలో ప్రయాణికులను ఎక్కించుకొని.. ఇవాళ రాత్రి 9.30కి విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. అక్కడ 9 మంది ప్రయాణికులు దిగుతారని రైల్వే అధికారులు చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. బ్రహ్మపురలో నలుగురు ప్రయాణికులు దిగగా.. 41 మంది విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో ఒకరు, తాడేపల్లిగూడెంలో ఇద్దరు, చెన్నైలో 133 మంది ప్రయాణికులు దిగుతారని దక్షిణమధ్య రైల్వే డివిజినల్‌ అధికారి తెలిపారు. ఆదివారం ఉదయానికి ఈ రైలు చెన్నై చేరుకుంటుందని చెప్పారు. 

మరోవైపు ప్రమాదానికి గురైన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారిలో 110 మంది విశాఖపట్నం స్టేషన్‌లో దిగాల్సి ఉంది. రాజమహేంద్రవరంలో 26 మంది, తాడేపల్లిగూడెంలో ఒకరు, ఏలూరులో ఇద్దరు, విజయవాడలో 39 మంది దిగాల్సి ఉంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒడిశాలోని బాలేశ్వర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 278 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాదాపు 900 మందికి పైగా క్షతగాత్రులైనట్లు అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని