Afghanistan: కాబుల్‌ సమీపంలో తాలిబన్లు.. ఏ క్షణమైనా దేశ రాజధానిలోకి!

అఫ్గానిస్థాన్‌ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టుసాధించిన వారు ఆదివారం ఉదయానికి  దేశ రాజధాని కాబుల్‌కు సమీపంలో ఉన్న మరో నగరం...

Published : 15 Aug 2021 11:25 IST

మెరుపు వేగంతో రాష్ట్రాల హస్తగతం

రక్తపాతం జరగనివ్వను: అధ్యక్షుడు అష్రఫ్‌

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ హస్తగతమే లక్ష్యంగా తాలిబన్ల దురాక్రమణ మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో మెజారిటీ భూభాగంపై పట్టుసాధించిన వారు ఆదివారం ఉదయానికి దేశ రాజధాని కాబుల్‌కు సమీపంలో ఉన్న మరో నగరం జలలాబాద్‌ను సైతం ఆక్రమించారు. వేకువజామున ప్రజలు నిద్ర లేచేసరికి నగరవ్యాప్తంగా తాలిబన్‌ జెండాలు పాతుకుపోయాయి. ప్రస్తుతం వారు కాబుల్‌కు అత్యంత సమీపంలో ఉన్నారు. జలాలబాద్‌ ఆక్రమణతో కాబుల్‌ నగరానికి తూర్పు ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఏ క్షణంలోనైనా తాలిబన్‌ మూకలు దేశ రాజధానిలోకి ప్రవేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్‌ పౌర ప్రభుత్వ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ ముందు కేవలం రెండు ప్రత్యామ్నాయాలు మిగిలాయి. ప్రభుత్వాన్ని తాలిబన్లకు అప్పగించడం లేదా వారితో భీకర పోరు కొనసాగించడం. మరో రెండు రోజుల్లో అఫ్గానిస్థాన్‌ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

అంతకుముందు దక్షిణాన ఉన్న లోగర్‌ రాష్ట్రాన్ని వారు శనివారం పూర్తిగా ఆక్రమించుకున్నారు. ఐదో అతిపెద్ద రాష్ట్రమైన మజార్‌-ఏ-షరీఫ్‌పైనా ఆధిపత్యం సాధించారు. ప్రస్తుతం కాబూల్‌కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుబాటుదారులు పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్నారు. ఏ క్షణమైనా వారు దేశ రాజధానిలోకి చొరబడే పరిస్థితులు నెలకొన్నాయి. కాందహార్‌లోని రేడియో స్టేషన్‌ను ఆక్రమించిన తాలిబన్లు... ఇక నుంచి ఇస్లామిక్‌ వార్తలనే ప్రసారం చేస్తామని ప్రకటించారు.

మరింత రక్తపాతం జరగనివ్వను.. అష్రఫ్‌ ఘనీ

తాజా పరిస్థితుల నేపథ్యంలో... దేశ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ శనివారం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘మరింత రక్తపాతం జరగనివ్వను. దేశంలో శాంతి, సుస్థిరతల స్థాపనపై దృష్టి సారిస్తాను. ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఆపాల్సి ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా- అఫ్గాన్‌ నుంచి తమ సిబ్బందిని వెనక్కు రప్పించే విషయమై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్, జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలివన్‌లు చర్చించారు.

తక్షణమే దాడులను ఆపండి: గుటెరస్‌

తాలిబన్ల దురాక్రమణలతో అఫ్గాన్‌ ప్రభుత్వం నియంత్రణ కోల్పోతోందని ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్లు తక్షణమే దాడులను నిలిపివేయాలన్నారు. బలప్రయోగం సుదీర్ఘ అంతర్యుద్ధానికి దారితీస్తుందని, అఫ్గాన్‌ను ఒంటరి దేశంగా మార్చుతుందని పేర్కొన్నారు. ప్రజలపైనా, జర్నలిస్టులపైనా ఆంక్షలు విధించడం సరికాదన్నారు. బాలికలు, మహిళల పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించడం హృదయ విదారకంగా ఉందన్నారు. వెంటనే చర్చలు ప్రారంభించాలని తాలిబన్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్లీజ్‌! మమ్మల్ని రానీయండి..దిల్లీ జేఎన్‌యూకు అఫ్గాన్‌ విద్యార్థుల మొర

దిల్లీలోని జేఎన్‌యూలో చదువుతున్న అఫ్గాన్‌ విద్యార్థులు... కరోనా సమయంలో తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో తాము తిరిగి వస్తామని, క్యాంపస్‌లో తలదాచుకునేందుకు అనుమతివ్వాలని వర్సిటీ ఉపకులపతికి విజ్ఞప్తులు చేస్తున్నారు. వారి తరఫున విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేతలు వీసీకి లేఖ రాశారు. ‘‘అఫ్గాన్‌లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చిక్కుకుపోయిన మన విద్యార్థులు వెనక్కు వచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోండి. వారు క్యాంపస్‌లో ఉండేందుకు వసతులు కల్పించాలి’’ అని కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రిజిస్ట్రార్‌ రవికేశ్‌ తెలిపారు.

భారత్‌ను పొగుడుతూనే...మోదీ సర్కారుకు హెచ్చరిక!

దేశంలోని 18 రాష్ట్రాలను వశపరుచుకున్న క్రమంలో తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహేల్‌ షహీన్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘అఫ్గాన్‌ ప్రజలకు భారత్‌ సాయం చేయడం, జాతీయ ప్రాజెక్టులు చేపట్టడం హర్షణీయమే. కానీ, మా దేశంలో వారు సైనిక చర్యలు చేపట్టకూడదు. మా దేశంలో నివసిస్తున్న సిక్కులు, హిందువులు తమ మతపరమైన ఆచారాలు పాటించుకోవచ్చు. వేడుకలు చేసుకోవచ్చు. ఇక్కడి రాయబార కార్యాలయాలకు, దౌత్య అధికారులకు ఎలాంటి హానీ ఉండదు. ప్రజలు తమంతట తామే తాలిబన్లకు లొంగిపోతున్నారు. సామాన్యులను చంపడం, హింసించడం ప్రభుత్వం చేస్తున్న పని. దాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మేం సిద్ధమే. కానీ, ఇందుకు ప్రభుత్వమే ముందుకు రావడంలేదు’’ అని షహీన్‌ పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత్, అమెరికా తదితర దేశాలు అఫ్గాన్‌ నుంచి తమ అధికారులను వెనక్కి రప్పించాయి. కాగా అఫ్గాన్‌ నుంచి సిక్కులు, హిందువులు సహా 20 వేల మందిని తరలించనున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని