టీకా పంపిణీ: ప్రైవేటు కేంద్రాల్లో తెలంగాణ టాప్‌!

ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సిన్‌ అందించడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Updated : 30 Mar 2021 19:06 IST

కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 60ఏళ్ల వారికే అనుమతి ఉండగా, ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి 45ఏళ్లు పైబడినవారు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని ప్రకటించింది. ఇక ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సిన్‌ అందించడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 48.39శాతం టీకాలు ప్రైవేటు కేంద్రాల్లోనే అందించినట్లు పేర్కొంది. దేశ రాజధాని దిల్లీ(43.11శాతం) రెండో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తోన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. ఇక్కడ ఇప్పటి వరకు 57లక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌ (54.84లక్షలు), ఉత్తర్‌ప్రదేశ్‌ (53.03లక్షలు), గుజరాత్‌ (52.62లక్షలు) రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 24లక్షలు, తెలంగాణలో 11లక్షల 75వేల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

855  కొత్తరకం కేసులు..

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ కొత్తరకం కరోనా కేసులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 11,064 నమూనాలకు జీనోమ్‌ సీక్సెన్స్‌ నిర్వహించగా వీటిలో 855 కొత్తరకం కేసులు బయటపడినట్లు తెలిపారు. వీటిలో 807 బ్రిటన్‌ రకాలు, 47 దక్షిణాఫ్రికా రకం, మరొక నమూనాలో బ్రెజిల్‌ రకం కరోనాను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కొత్తరకం కరోనా వైరస్‌లపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. బ్రిటన్‌, బ్రెజిల్‌ రకాలపై ఈ టీకాలు పనిచేస్తున్నట్లు ఇప్పటికే నిర్ధారణ కాగా, దక్షిణాఫ్రికా రకంపై పరిశోధన కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

మహారాష్ట్రలో 23శాతం పాజిటివిటీ రేటు..

ప్రస్తుతం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 94శాతం ఉండగా, మరణాల రేటు 1.34శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ రేటు వారం సరాసరి 5.65శాతంగా ఉండగా, మహారాష్ట్రలో మాత్రం 23శాతంగా ఉందని పేర్కొంది. పంజాబ్‌(8.82శాతం), ఛత్తీస్‌గఢ్‌(8శాతం), మధ్యప్రదేశ్‌(7.82), తమిళనాడు(2.50), కర్ణాటక(2.45), గుజరాత్‌(2.2), దిల్లీ(2.04శాతంగా) రాష్ట్రాల్లోనూ కొవిడ్‌ పాజిటివిటీ రేటు పెరుగుతున్నట్లు కేంద్రం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని