బిల్‌గేట్స్‌నే బురిడీ కొట్టించాడు.. నివ్వెరపరుస్తున్న నఖ్వీ బాగోతం

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు, అపర కుబేరుడు బిల్‌ గేట్స్‌ను పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.వందల కోట్ల మేరకు

Updated : 23 Aug 2021 08:56 IST

రూ.వందల కోట్లు ముంచిన పాకిస్థాన్‌ వ్యాపారవేత్త

న్యూయార్క్‌: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు, అపర కుబేరుడు బిల్‌ గేట్స్‌ను పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి రూ.వందల కోట్ల మేరకు మోసం చేశాడంటే నమ్మశక్యమా? కానీ అదే నిజం అంటున్నారు సైమన్‌ క్లార్క్, విల్‌ లోచ్‌ అనే రచయితలు. బిల్‌ గేట్స్‌ లాంటి వ్యాపార దిగ్గజాన్ని ఓ పాకిస్థానీ అంత సునాయాసంగా ఎలా మోసం చేయగలిగాడనే విషయాన్ని వారు ‘ది కీ మ్యాన్‌: ది ట్రూ స్టోరీ ఆఫ్‌ హౌ ది గ్లోబల్‌ ఎలైట్‌ వాజ్‌ డూప్డ్‌ బై ఎ క్యాపిటలిస్ట్‌ ఫెయిరీ టేల్‌’ అనే పుస్తకంలో పూసగుచ్చినట్లు వివరించారు. వ్యాపారంతో పాటు దాతృత్వ కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉండే గేట్స్‌లోని దానగుణాన్ని ఆసరాగా చేసుకుని ఆరిఫ్‌ నఖ్వీ అనే పాకిస్థానీ 100 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.743 కోట్లు) భారీ మోసానికి పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు. గేట్స్‌తోపాటు ఎంతో మంది ప్రముఖులు ఆరిఫ్‌ బుట్టలో పడ్డారని వెల్లడించారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో చదువుకున్న నఖ్వీ వ్యాపారవేత్తగా మారాడు. 118 మిలియన్‌ డాలర్లతో ప్రైవేటు ఈక్విటీ సంస్థ అబ్రాజ్‌ గ్రూప్‌ను స్థాపించాడు. ఈ క్రమంలోనే పేదరికాన్ని రూపుమాపే ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు నఖ్వీ ప్రకటించాడు. 2010 ఏప్రిల్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారవేత్తల సమావేశానికి ఆహ్వానం అందిన 250 మంది ముస్లిం వ్యాపారవేత్తల్లో నఖ్వీ కూడా ఉన్నాడు. ప్రపంచాన్ని ప్రభావితం చేసే పెట్టుబడులు, శిక్షణ, ఉపాధి కల్పన లాంటి అంశాలపై నఖ్వీ అక్కడ ప్రసంగించాడు. రెండు నెలల తర్వాత అమెరికా ప్రభుత్వం నఖ్వీకి చెందిన అబ్రాజ్‌ సంస్థలో 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. పలు విశ్వవిద్యాలయాలకు నఖ్వీ కోట్ల రూపాయలు విరాళం అందించాడు. గేట్స్‌ ఫౌండేషన్‌ మాదిరిగానే దాతృత్వ కార్యక్రమాల కోసం అమన్‌ ఫౌండేషన్‌ను స్థాపించాడు. 2017 సెప్టెంబర్‌లో బిలియన్‌ డాలర్ల నిధిని సమీకరించే లక్ష్యంతో నఖ్వీ న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలపై పోరాడేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చాడు. ప్రపంచంలోని సంపన్నులు, బలమైన నేతలను కలిశాడు. అందులో బిల్‌ గేట్స్, బిల్‌ క్లింటన్‌ వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ క్రమంలోనే నఖ్వీ చురుకుదనం, దాతృత్వ గుణం బిల్‌ గేట్స్‌కు నచ్చాయి. దీంతో గేట్స్‌కు నఖ్వీ దగ్గరయ్యాడు.

జనాభా నియంత్రణ పేరుతో టోకరా

పాకిస్థాన్‌లో జనాభా నియంత్రణకు కృషి చేస్తానని నఖ్వీ చెప్పడంతో బిల్‌ గేట్స్‌ తన ఫౌండేషన్‌ నుంచి 100 మిలియన్‌ డాలర్లను అందించారు. ఆ తర్వాత న్యూ అబ్రాజ్‌ గ్రోత్‌ మార్కెట్స్‌ హెల్త్‌ ఫండ్‌కు ఇతర పెట్టుబడిదారుల ద్వారా 900 మిలియన్‌ డాలర్లు అందాయి. అయితే నఖ్వీ నిధులను దుర్వినియోగం చేయటం అప్పటికే ప్రారంభించాడు. నియంత్రణ సంస్థల తనిఖీల సమయంలో బ్యాంకుల్లో డబ్బులు చూపించి ఆ తర్వాత ఖాళీ చేసేవారు. కొన్నాళ్ల తర్వాత అబ్రాజ్‌ సంస్థ ఉద్యోగి ఒకరు పెట్టుబడిదారులకు జరుగుతున్న మోసంపై రహస్య ఈమెయిల్‌ పంపగా నఖ్వీ బండారం బయటపడింది. అబ్రాజ్‌ లెడ్జర్‌ పుస్తకాలపై గేట్స్‌ ఫౌండేషన్‌ దర్యాప్తు చేయించింది. 660 మిలియన్‌ డాలర్ల నిధులు పెట్టుబడిదారులకు తెలియకుండా అబ్రాజ్‌ రహస్య ఖాతాల్లోకి వెళ్లాయని తేలింది.  385 మిలియన్‌ డాలర్లకు ఇప్పటికీ లెక్కలు లేవు. 2019 ఏప్రిల్‌ 10న లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో నఖ్వీని అరెస్ట్‌ చేశారు. అవినీతి ఆరోపణలు నిజమైతే.. ఆయనకు 291 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని