Tihar Jail: నిందితులతో కుమ్మక్కు.. 28 మంది జైలు అధికారులపై వేటు

ఓ కేసులో నిందితులుగా ఉన్న వారితో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 28 మంది జైలు అధికారులు సస్పెండయ్యారు.

Published : 14 Oct 2021 15:44 IST

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అధికారుల చర్యలు

దిల్లీ: ఓ కేసులో నిందితులుగా ఉన్న వారితో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 28 మంది జైలు అధికారులు సస్పెండయ్యారు. దిల్లీలోని యునిటెక్‌ మాజీ ప్రమోటర్లు అజయ్‌ చంద్ర, సంజయ్‌ చంద్రలకు తిహాడ్‌ జైలు అధికారులు సహకరించారని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిపై చర్యలు తీసుకొని దర్యాప్తు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో దిల్లీ జైళ్లశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తిహాడ్‌ జైలు 7 నంబరుకు చెందిన వారిలో మొత్తం 28 మంది అధికారులపై చర్యలకు ఉపక్రమించగా.. మరో ఇద్దరు తాత్కాలిక ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. మరో ఇద్దరు అధికారులపై దిల్లీ ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.

ఇళ్ల కొనుగోలుదారుల సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన యునిటెక్‌ స్థిరాస్తి సంస్థ మాజీ ప్రమోటర్లు సంజయ్‌ చంద్ర, అజయ్‌ చంద్రలతో అధికారులు కుమ్మక్కయి వారు జైలు నుంచే వ్యాపార లావాదేవీలు చేసుకునేలా వీలు కలిగించారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఫిర్యాదు చేసింది. దీనిపై దిల్లీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ ఆస్థానా సీల్డు కవర్‌లో ఇచ్చిన నివేదికను పరిశీలించిన న్యాయమూర్తులు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం వారిపై చర్యలు తీసుకోవాలని అక్టోబర్‌ 6న ఆదేశించింది. అనంతరం పూర్తి దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా జైలు నిర్వహణను మెరుగు పరిచేందుకు ఆస్థానా ఇచ్చిన సూచనలను అమలు చేయాలని కేంద్ర హోమంత్రిత్వ శాఖకు సుప్రీం కోర్టు సూచించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా ఈ కేసులో మొత్తం 32 మంది అధికారులపై దిల్లీ క్రైం బ్రాంచ్‌ కేసు నమోదు చేసింది. అనంతరం వారిపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పేర్కొంది. తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని దిల్లీ క్రైం బ్రాంచ్‌ వెల్లడించింది.

ఇక  జైల్లో ఉన్న యునిటెక్‌ ప్రమోటర్లు అక్కడి అధికారులతో కుమ్మక్కయ్యారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిని తిహార్‌ జైలు నుంచి తొలుత ముంబయి ఆర్తూర్‌ రోడ్‌ జైలుకు తరలించారు. అనంతరం అక్కడి నుంచి తలోజా సెంట్రల్‌ జైలుకు పంపించారు. విచారణ సందర్భంగా జైలు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం, సంజయ్‌ చంద్ర, అజయ్‌ చంద్రల ప్రవర్తనపై ఈడీ ఇచ్చిన నివేదికలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయస్థాన ఆదేశాలను నిర్వీర్యం చేసే ఇలాంటి ఘటనలు తీవ్రమైన, కలవరపెట్టే సమస్యలకు దారితీస్తాయనిపేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు