
US: బైడెన్ అడ్వైజరీ కమిషన్లో నలుగురు భారతీయ అమెరికన్లు
వాషింగ్టన్: భారతీయ అమెరికన్లకు మొదటినుంచి ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. మరోసారి తన ప్రభుత్వంలో వారికి చోటు కల్పించారు. ఆసియా అమెరికన్లు, నేటివ్ హవాయన్స్ సహా పసిఫిక్ దీవులకు (ఏఏఎన్హెచ్పీఐ) చెందిన వారి కోసం తాజాగా ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిషన్లో నలుగురు ఇండో అమెరికన్లను నియమించారు. ఈ విషయాన్ని శ్వేతసౌధం వెల్లడించింది. భారతీయ అమెరికన్లయిన అజయ్ భుటోరియా, సోనాల్ షా, కమల్ కాల్సి, స్మితా షాలకు 23 మంది సభ్యులుగల అడ్వైజరీ కమిషన్లో చోటు కల్పిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటనలో పేర్కొంది.
అజయ్ భుటోరియా సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తూ.. ఆసియన్ అమెరికన్లు, పసిఫిక్ ఐలాండర్స్ కోసం కృషి చేశారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆర్థిక వేత్త సోనాల్ షా అక్కడ విద్యారంగంలో విశేష కృషి చేశారు. డాక్టర్ కమల్ సింగ్ కాల్సి అమెరికా సైన్యానికి 20 ఏళ్ల పాటు సేవలు అందించారు. అఫ్గానిస్థాన్లో ఆయన అందించిన సేవలకుగాను ప్రభుత్వం ఆయనకు బ్రాన్జ్ స్టార్ మెడల్ను ఇచ్చి గౌరవించింది. ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన స్మితా ఎన్ షా.. షికాగోకు చెందిన స్పాన్ టెక్కు సీఈఓగా పనిచేస్తున్నారు.
ప్రతి ఆసియా అమెరికన్, స్థానిక హవాయిలు, పసిఫిక్ ద్వీపవాసుల కమ్యూనిటీకి సమాన అవకాశాలను కల్పించేలా లాభాపేక్షలేని పబ్లిక్, ప్రైవేటు రంగాలు కలిసి పని చేసే మార్గాలపై ఈ కమిషన్ అధ్యక్షుడికి సలహాలు అందివ్వనుంది. వారి సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేస్తుంది. అంతేకాకుండా.. ఆసియన్లు ఎదుర్కొంటున్న విద్వేషం, హింసను కట్టడి చేయడంపై కూడా అధ్యక్షుడికి సూచనలు అందిస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.