Moderna Vaccine: 6 నెలల తర్వాత కూడా 93శాతం ప్రభావశీలత!

సెకండ్‌ డోసు తీసుకున్న 6నెలల తర్వాత కూడా తమ టీకా 93శాతం ప్రభావశీలత చూపించినట్లు అమెరికా వ్యాక్సిన్‌ సంస్థ మోడెర్నా వెల్లడించింది.

Updated : 24 Nov 2022 14:56 IST

వెల్లడించిన మోడెర్నా సీఈఓ

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి వల్ల ఎంతకాలం రక్షణ ఉంటుందనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సెకండ్‌ డోసు తీసుకున్న 6నెలల తర్వాత కూడా తమ టీకా 93శాతం ప్రభావశీలత చూపించినట్లు అమెరికా వ్యాక్సిన్‌ సంస్థ మోడెర్నా వెల్లడించింది. అంతకుముందు 94శాతం సమర్థత చూపించగా.. ఆరు మాసాల తర్వాత కేవలం స్వల్ప మార్పు మాత్రమే కనిపించిందని పేర్కొంది. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న వేళ బూస్టర్‌ డోసు అవసరం కావచ్చని మోడెర్నా అంచనా వేస్తోంది.

‘రెండో డోసు తీసుకున్న 6నెలల తర్వాత మా టీకా 93శాతం ప్రభావశీలత చూపించింది. అయినప్పటికీ డెల్టా వేరియంట్‌ ఓ ముప్పుగా తయారయ్యిందని.. ఇలాంటి వాటిపై మేము మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది’ అని మోడెర్నా సీఈఓ స్టీఫేన్‌ బాన్సల్‌ పేర్కొన్నారు. ఇక తమ సంస్థ ఈ ఏడాది చివరినాటికి 80 నుంచి 100కోట్ల డోసుల ఉత్పత్తి లక్ష్యాన్ని మాత్రమే పెట్టుకున్నట్లు చెప్పారు. అంతకుమించి ఆర్డర్లను తీసుకోమని స్టీఫేన్‌ బాన్సల్‌ స్పష్టం చేశారు.

‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ప్రయోగాల్లోనూ సురక్షితమని నిరూపితమైంది. క్లినికల్ ట్రయల్స్‌ పూర్తి చేసుకొన్న 6 నెలల అనంతరం జరిపిన అధ్యయనంలోనూ ఇదే విధమైన ఫలితాలు వచ్చాయి. మూడోదశ ప్రయోగాల్లో భాగంగా కోవ్‌ (COVE) పేరుతో వ్యాక్సిన్‌ తీసుకున్న 900 కేసుల సమాచారాన్ని విశ్లేషించగా 90శాతానికి పైగా ప్రభావశీలత చూపించింది. తాజాగా వాస్తవ ఫలితాల్లోనూ 93శాతం ప్రభావశీలత చూపించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని