Afghanistan: అదను చూసి నమ్మక ద్రోహం: తాలిబన్లతో చేతులు కలిపిన ఘనీ సన్నిహితుడు! 

అమెరికా ఊహించినదాని కంటే వేగంగా అఫ్గాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడం వెనుక

Published : 24 Aug 2021 10:41 IST

అందుకే అంత వేగంగా కాబుల్‌ హస్తగతం 

దిల్లీ: అమెరికా ఊహించినదాని కంటే వేగంగా అఫ్గాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకోవడం వెనుక ఓ వ్యక్తి నమ్మకద్రోహం ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇబ్బందుల్లో పడ్డ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీకి అత్యంత సన్నిహితుడు మిర్వాయిస్‌ యాసినీయే ఆ వ్యక్తి అని తెలుస్తోంది. ఆయన తాలిబన్లను తీవ్రంగా విమర్శిస్తూ, ఘనీ వెంటే ఉంటూ చివరకు తాలిబన్లతో చేతులు కలపడంతో వారి దురాక్రమణ వేగం పుంజుకుంది. నిజానికి కాబుల్‌ అంత తేలిగ్గా తాలిబన్ల వశం కాదన్న తమ గూఢచారి వర్గాల అంచనాలను నమ్మి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వేసవి విహారానికీ సిద్ధమయ్యారు. అంతలో అన్ని అంచనాలను తారుమారు చేస్తూ కాబుల్‌ వేగంగా తాలిబన్ల వశమైంది. వారితో యాసినీ కుమ్మక్కు కావడం చూస్తే, అఫ్గాన్‌ ప్రభుత్వం, సైన్యంలోని లుకలుకలే ప్రభుత్వ శీఘ్ర పతనానికి మూల కారణమని తేలిపోతోంది. కాబుల్‌ అతి తేలిగ్గా తాలిబన్ల పరం కావడంతో అమెరికా 3,000 మంది సైనికులను హుటాహుటిన అక్కడికి పంపాల్సి వచ్చింది.

కీలక బాధ్యతల అప్పగింత 

అఫ్గాన్‌ పార్లమెంటు దిగువ సభకు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న యాసినీ తూర్పు నంగార్హర్‌ రాష్ట్రానికి ప్రతినిధి. పష్తూన్‌ తెగకు చెందినవారు. ఇప్పుడు కాబుల్‌ బాధ్యతను తాలిబన్లు ఆయనకే అప్పగించారు. అఫ్గానిస్థాన్‌ భద్రత, సుస్థిరతలకు అతిపెద్ద ముప్పు ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) నుంచి కాదు, తాలిబన్ల నుంచే పొంచి ఉందని నాలుగేళ్ల క్రితం ఆయన చెబుతూ వచ్చేవారు. 16 ఏళ్ల వయసులోనే తుపాకీ పట్టిన ఆయన.. 1986లో ఉన్నత చదువులకు పాకిస్థాన్‌ వెళ్లారు. ఇస్లామాబాద్‌లోని ఇస్లామిక్‌ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (ఐఐఐయు)లో ఇస్లామిక్‌ న్యాయ శాస్త్రం, రాజనీతి శాస్త్రాల్లో పీజీ చేశారు. 1996-2001 మధ్య అఫ్గాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్లపై పోరాటం జరిపి, వారి పతనం తర్వాత ప్రభుత్వంలో చేరి, 2005 వరకు ఉప మంత్రిగా ఉన్నారు. 2009లో దేశాధ్యక్ష పదవికి పోటీ చేసి విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు తాలిబన్లను వ్యతిరేకించిన ఆయన ఏ పరిస్థితుల్లో ఇప్పుడు వారికి వంత పాడారనే విషయంపై స్పష్టత లేదు. తాలిబన్లు మాత్రం ఆయనకు కీలక బాధ్యతలనే అప్పగించారు. రాజధాని కాబుల్‌ భద్రత వ్యవహారాలు ఆయన చేతిలో పెట్టినట్లు సమాచారం. అఫ్గాన్‌ అధ్యక్షునిగా హమీద్‌కర్జాయ్‌ ఉన్నప్పుడు ఆయనకూ విశ్వాసపాత్రునిగా యాసినీ ఉండేవారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని