Farm Laws Repeal: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేబినెట్‌ ఆమోదం..!

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది.

Updated : 24 Nov 2021 16:27 IST

ప్రధాని అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో తీర్మానం

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి అధ్యక్షతన నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021’ను ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు కలిపి ఒకే బిల్లును రూపొందించినట్లు వ్యవసాయశాఖ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో ఈ నెల 29 నుంచి మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజునే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కొన్ని మినహా మిగతా ప్రైవేటు క్రిప్టో కరెన్సీల రద్దు/నియంత్రణ, అధికారికంగా డిజిటల్‌ ద్రవ్యాన్ని జారీ చేయడానికి ఆర్‌బీఐని అనుమతించడం వంటి అంశాలతో పాటు మొత్తం 26 బిల్లుల్ని ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు పూర్తిచేసింది. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా ‘విత్తనాలపై బిల్లు’ను కూడా పార్లమెంటు ఆమోదానికి తేనుంది. వీటితోపాటు విద్యుత్తు సవరణ బిల్లు, ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లును తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. వీటికి సంబంధించి నేటి మంత్రివర్గ సమావేశాల్లో తీర్మానం చేయనున్నట్లు సమాచారం.

ఇదిలాఉంటే, కేంద్రం తెచ్చిన నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘాలు దాదాపు సంవత్సర కాలంగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దులో ఉద్యమిస్తున్నాయి. ఈ నిరసనలు ప్రారంభమై  ఈ నవంబర్‌ 26 నాటికి దాదాపు ఏడాది కానుంది. ఇదే సమయంలో సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను ఈ శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగానే కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని