Zycov D: జైడస్‌ క్యాడిలా ఒక్క డోసు ధర రూ.265

మూడో డోసుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసుకు రూ.265కు ఇచ్చేందుకు జైడస్‌ క్యాడిలా అంగీకరించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

Published : 08 Nov 2021 21:52 IST

త్వరలోనే చిన్నారుల టీకా అందుబాటులోకి..

దిల్లీ: జైడస్‌ క్యాడిలా రూపొందించిన కొవిడ్‌ టీకా జైకోవ్‌-డీ (Zycov-D) కోటి డోసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డర్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, మూడు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసుకు రూ.265కు ఇచ్చేందుకు జైడస్‌ క్యాడిలా అంగీకరించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అయితే, సూది అవసరం లేకుండానే పంపిణీ చేసే ఈ టీకా కోసం ప్రత్యేకంగా ఓ పరికరాన్ని వాడనున్నారు. దీని ధర రూ.93 కలుపుకొని (జీఎస్‌టీ కాకుండా) జైకోవ్‌-డీ ఒక డోసు ధర రూ.358 అవుతుందని పేర్కొంది. కేంద్రంతో సంప్రదించిన తర్వాతే ఈ ధరను నిర్ణయించినట్లు జైడస్‌ క్యాడిలా ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన పిల్లల కోసం అనుమతి పొందిన తొలి టీకాగా జైకోవ్‌-డీ నిలిచింది. అయితే, ఈ టీకాను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో డోసు ఖరీదు రూ.265 కాగా.. జెట్‌ అప్లికేటర్‌కు రూ.93, 5శాతం జీఎస్‌టీ (రూ.18) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మూడు డోసులకు మొత్తంగా రూ.1128గా అవనున్నట్లు తెలుస్తోంది. అయితే, మూడు డోసుల్లో అందించే ఈ టీకాను తొలుత రూ.1900కు అందజేస్తామని జైడస్‌ క్యాడిలా ప్రతిపాదించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలతో పోలిస్తే జైడస్‌ ధర ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థతో సంప్రదింపులు జరిపింది. దీంతో చివరకు ఒక డోసును రూ.265కు ఇచ్చేందుకు జైడస్‌ అంగీకరించినట్లు సమాచారం. సూది లేకుండా వాడిపారేసే జెట్‌ అప్లికేటర్‌ను వినియోగించనున్నందున దాని ధర రూ.93 కలుపుకొని.. ఒక డోసుకు రూ.358 అవుతుంది.

ఇదిలాఉంటే, సూది అవసరం లేకుండా మూడు డోసుల్లో ఇచ్చే ఈ టీకాను 12ఏళ్ల వయసుపైబడిన వారికి ఇచ్చేందుకు ఆగస్టు 20వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో డోసును 28రోజుల వ్యవధి చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా రూపొందించిన ఈ టీకా.. ప్రపంచంలోనే అనుమతి పొందిన డీఎన్‌ఏ ఆధారిత తొలి కరోనా టీకాగా నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని