Covid Origins: కొవిడ్‌ మూలాలపై అమెరికా నివేదిక.. మరోసారి మండిపడ్డ చైనా!

కొవిడ్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం రూపొందించిన నివేదికపై చైనా మరోసారి మండిపడింది. కేవలం దాన్ని రాజకీయ, తప్పుడు నివేదికగా పేర్కొన్న చైనా.. తమపై దాడులు చేయడాన్ని మానుకోవాలని అమెరికాకు హితవు పలికింది.

Published : 01 Nov 2021 01:21 IST

మరోసారి దర్యాప్తునకు ససేమిరా

బీజింగ్‌: కొవిడ్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం రూపొందించిన నివేదికపై చైనా మరోసారి మండిపడింది. కేవలం దాన్ని రాజకీయ, తప్పుడు నివేదికగా పేర్కొన్న చైనా.. తమపై దాడులు చేయడాన్ని మానుకోవాలని అమెరికాకు హితవు పలికింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో మరోసారి దర్యాప్తునకు అంతర్జాతీయ నిపుణుల బృందం సిద్ధమవుతోన్న వేళ చైనా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.

కొవిడ్‌ మూలాలపై ఆగస్టులో విడుదలైన నివేదికను గట్టిగా వ్యతిరేకించామని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ మరోసారి పేర్కొన్నారు. ఆ నివేదిక ఎన్నిసార్లు ప్రచురితమైనా, వాటిని మార్పులు చేసి ఎన్ని రకాల కట్టుకథలు అల్లినా.. వారి రాజకీయ, తప్పుడు స్వభావం అర్థమవుతూనే ఉంటుందని విమర్శించారు. కొవిడ్‌ మూలాలను గుర్తించే పేరుతో అమెరికా నిఘా విభాగం చేసిన ప్రయత్నాలు రాజకీయం చేస్తుందనడానికి గట్టి నిదర్శనమన్నారు. ఈ నేపథ్యంలో చైనాపై దాడులు చేయడం, దుమ్మెత్తిపోసే చర్యలను ఆపివేయాలని వాంగ్‌ వెన్‌బిన్‌ విజ్ఞప్తి చేశారు.

కొవిడ్‌ మూలాలపై 90రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అక్కడి నిఘా విభాగాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు కొవిడ్‌ మూలాలపై అమెరికా నిఘా విభాగం రెండు నెలల కిందటే ఓ నివేదికను రూపొందించింది. కొవిడ్‌ మూలాలపై కొత్తగా ఎటువంటి సమాచారం లేనందున కచ్చితంగా ఓ తుది నిర్ణయానికి రాలేకపోతున్నట్లు అందులో పేర్కొంది. ముఖ్యంగా జంతువుల నుంచి మానవులకు సోకిందా లేక ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందా అనే విషయంపై స్పష్టత రాలేదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ దర్యాప్తునకు చైనా అడ్డుతగులుతుందన్న అమెరికా.. వాటిపై తుది నిర్ణయానికి రావాలంటే చైనా మరింత సహకారం అందించాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో మరోసారి దర్యాప్తును వ్యతిరేకిస్తోన్న చైనా.. కొవిడ్‌ మూలాలపై అంతర్జాతీయ బృందం దర్యాప్తు జరపడాన్ని తప్పుబడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని