Covid: కరోనా రోజూవారీ జీవితంలో భాగం కానుందా..?

అగ్రదేశం అమెరికాను డెల్టా వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం లక్షకు పైగా కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.

Updated : 15 Sep 2021 15:28 IST

అమెరికాలో విజృంభిస్తోన్న డెల్టా

త్వరలో గరిష్ఠస్థాయికి మహమ్మారి

వాషింగ్టన్‌: అగ్రదేశం అమెరికాను డెల్టా వేరియంట్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిత్యం లక్షకు పైగా కరోనా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. త్వరలో వైరస్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఏమాత్రం ఉదాసీనత వద్దని ప్రజలు, అధికారుల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఈ వైరస్ రోజువారీ జీవితంలో భాగం కానుందని, ఒక ఫ్లూ మాదిరిగా ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోనుందని అంటున్నారు.

అమెరికాలో నిత్యం లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల రోజువారీ కేసుల వృద్ధి కాస్త మందగించడం, కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ, ఇప్పటికీ నమోదవుతోన్న సంఖ్య ఏమాత్రం తక్కువ కాదని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోజుకు సుమారు 1,800 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షమందికి పైగా కొవిడ్ తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీకాలు తీసుకోని వారిలోనే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని ఇప్పటికే అక్కడి వైద్యులు గుర్తించారు. తప్పుడు సమాచారం కారణంగా కొందరిలో టీకాలపై అనుమానాలు నెలకొన్నాయి. దాంతో వారికి టీకాలు వేయడం అధికారులకు సవాలుగా మారుతోంది.

జాన్‌ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హన్సోటీ మాట్లాడుతూ.. మునుపటి ముప్పు నుంచి మనం నేర్చుకోకపోతే మరోసారి వైరస్ విజృంభించే అవకాశం ఉందన్నారు. వైరస్‌లో కొత్త రకాలతోపాటు శీతకాలం ప్రారంభం కావడంతో చల్లని వాతావరణం కారణంగా ఇంటిలోపలే ఎక్కువ సేపు ఉండాల్సి రావడం మరో ముప్పునకు దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. శీతకాలంలో వైరస్ గరిష్ఠ స్థాయికి చేరి తగ్గడం, మళ్లీ పెరగడం.. ఇలాంటి సందర్భాలున్నాయని కెనడాకు చెందిన వైరాలజిస్టు ఏంజెలా రాస్‌ముస్సెన్ అన్నారు. ఈ ముప్పు నేపథ్యంలో జనాభాలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు అందడం ఆవశ్యకమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం అర్హులైన జనాభా(12 ఏళ్లు పైబడినవారు)లో 63.1 శాతం మందికి పూర్తిగా టీకాలు అందాయి. మొత్తం జనాభా పరంగా చూసుకుంటే అది 54 శాతంగా ఉంది. అమెరికాలో టీకాల లభ్యత సమృద్ధిగా ఉన్నప్పటికీ.. పోర్చుగల్‌(81 శాతం), యూఏఈ(79 శాతం) కంటే వెనుకబడే ఉండటం గమనార్హం.

వ్యాక్సినేషన్‌తో పాటుగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే చర్యలపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరస్‌ హాట్‌స్పాట్‌లలో ప్రజలు మాస్క్‌లు ధరించడం వంటి కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని చెప్తున్నారు. అలాగే పాఠశాలలు, వ్యాపార కార్యకలాపాలు సాగేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని చెప్తున్నారు. ఇంకోపక్క వైరస్ సహజ సంక్రమణ, టీకాలు తీసుకోవడం వల్ల వచ్చిన నిరోధకతతో దేశం హెర్డ్‌ ఇమ్యూనిటీకి చేరువవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వీటిపై ఏంజెలా స్పందించారు. హెర్డ్ ఇమ్యూనిటీకి చేరువైనట్లు ఇప్పుడే ప్రకటించడం తొందరపాటే అవుతుందన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వయోజనుల్లో వ్యాక్సినేషన్ రేటు 50 శాతం కంటే తక్కువగానే ఉందని గుర్తుచేశారు.

ఎండెమిక్‌గా మారనుందా..?

కొత్త రకాలు వెలుగులోకి వచ్చినప్పటికీ.. వాటిలో డెల్టా ప్రభావం తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో మ్యుటేషన్ల కారణంగా కొత్త వేరియంట్లకు అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే టీకాలే వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని, రాబోయే రోజుల్లో పిల్లలకు టీకాలు అందుబాటులోకి వస్తాయని నిపుణులు ఆశిస్తున్నారు. వృద్ధులు, బలహీన రోగ నిరోధక శక్తి ఉన్నవ్యక్తుల్ని బూస్టర్ డోసులు ఆదుకుంటాయని భావిస్తున్నారు. అయితే ఈ వైరస్‌ను పూర్తిగా నిర్మూలించడం వీలుకాకపోవచ్చని, ఇది ఎండెమిక్‌(వ్యాధి ఒక దేశం,  ఒక ప్రాంతానికే పరిమితమవడం, ఓ మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి)గా మారే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. బ్రేక్‌ త్రూ ఇన్ఫెక్షన్లు సోకిన వారిలో ఇది ఫ్లూ మాదిరిగా ఉందన్నారు. అయితే దీనిపై వారు స్పష్టమైన అభిప్రాయాన్ని మాత్రం వ్యక్తం చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని