Supreme Court: అనాథ చిన్నారుల పరిస్థితి.. హృదయ విదారకం!

కరోనా వైరస్‌ సృష్టించిన విలయం ఎన్నో జీవితాలను నాశనం చేసిందని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారికి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి హృదయం విదారకంగా ఉందని అభిప్రాయపడింది.

Published : 30 Aug 2021 15:50 IST

ప్రభుత్వాల చర్యలు సంతృప్తికరమన్న సుప్రీం కోర్టు

దిల్లీ: కరోనా వైరస్‌ సృష్టించిన విలయం ఎన్నో జీవితాలను నాశనం చేసిందని భారత అత్యున్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తంచేసింది. ముఖ్యంగా కొవిడ్‌ మహమ్మారికి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి హృదయం విదారకరంగా ఉందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి చిన్నారులను గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తూనే.. ఉచిత వసతి, విద్య వంటి ప్రయోజనాలను వారికి అందించే చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వాలకు సూచించింది.

‘కొవిడ్‌-19 మహమ్మారి సృష్టించిన విలయం ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. వారి మనుగడ ప్రమాదంలో ఉండడం ఎంతో కలచివేస్తోంది’ అని జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ అనిరుద్ధ్‌ బోస్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అయితే, కొవిడ్‌ మహమ్మారి కారణంగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులను గుర్తించే ప్రక్రియ సంతృప్తికరంగానే ఉందని కోర్టు అభిప్రాయపడింది. చిన్నారుల సంరక్షణ కేంద్రాలపై కొవిడ్‌ పిడుగు అనే అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. విచారణ సందర్భంగా ఈ విధంగా స్పందించింది.

కేంద్రంతో పాటు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలు కూడా ఆపదలో ఉన్న చిన్నారులను ఆదుకునేందుకు పలు పథకాలు ప్రకటించాయని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఇలాంటి చిన్నారుల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో అధికారులు ఆటంకాలు లేకుండా కృషిచేస్తారనడంలో మాకు ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడింది. ఇప్పటికే అనాథ చిన్నారులను గుర్తించే ప్రక్రియను శిశు సంక్షేమ సంఘాలు చేపట్టాలని సూచించింది. ఇలా గుర్తించిన వెంటనే వారికి ప్రయోజనాలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ సందర్భంగా మహమ్మారి విజృంభణ సమయంలో అనాథలైన వారిలో దాదాపు 2600 మందిని ఇప్పటికే గుర్తించామని కేంద్ర తరపున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యాభాతి సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. వారందరికీ జిల్లా కలెక్టర్ల సహకారంతో ఉచిత వసతితో పాటు విద్యను అందించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని