General Naravane: మహమ్మారి వేళ.. విపత్తు ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్..!

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి ముప్పు ఇంకా ముగిసిపోలేదని, ప్రతి ఒక్కరికీ ఇది ఎన్నో పాఠాలు నేర్పిందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె పేర్కొన్నారు.

Published : 20 Dec 2021 18:23 IST

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె

పుణె: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి ముప్పు ఇంకా ముగిసిపోలేదని, ప్రతి ఒక్కరికీ ఇది ఎన్నో పాఠాలు నేర్పిందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె పేర్కొన్నారు. ఈ సమయంలో విపత్తులకు స్పందించడం అనేది ఓ వాస్తవం అన్న ఆయన.. అదే పెద్ద సవాల్‌ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహమ్మారి తరహా ఎటువంటి వైపరీత్యాలు వచ్చినా ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ, ప్రాంతీయ సహకారం ఎంతో ముఖ్యమని గుర్తుచేశారు. పుణెలో బంగాళాఖాత తీరప్రాంత దేశాల కూటమి ఏర్పాటు చేసిన సైనిక విన్యాస కార్యక్రమంలో (PANEX-21) పాల్గొన్న ఆర్మీ చీఫ్‌.. మహమ్మారి సవాళ్లను ప్రధానంగా ప్రస్తావించారు.

‘వరదలు, తుపానులు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాల ముప్పు దక్షిణాసియా ప్రాంతానికి అధికంగా ఉంది. వేగంగా విస్తరిస్తోన్న ప్రణాళికలేని నగరీకరణ, పర్యావరణ క్షీణత, వాతావరణ మార్పులతో పాటు సామాజిక-ఆర్థిక పరిస్థితులపై ఈ విపత్తుల ప్రభావం క్రమంగా పెరుగుతూనే ఉంది. అధిక తీవ్రత కలిగిన ఇటువంటి వైపరీత్యాలను ఈ ప్రాంతంలో తరచుగా చవిచూస్తూనే ఉన్నాం. మహమ్మారి తగ్గే వరకూ ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వేచి ఉండవు. అందుకే సాంకేతికంగా వస్తోన్న మార్పులను అందిపుచ్చుకుంటూ ద్వంద్వ విపత్తులను ఎదుర్కొనే వ్యూహాలను సిద్ధం చేసుకోవాలి. అదే సమయంలో ప్రాంతీయ సహకారం కూడా ఎంతో అవసరం’ అని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నవరణె పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, భారత్‌తోపాటు బంగాళాఖాతం తీర ప్రాంతాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, మయన్మార్‌, నేపాల్‌, శ్రీలంక, థాయిలాండ్‌ దేశాలతో కలిసి BIMSTEC ప్రాంతీయ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంతోపాటు సహకారాన్ని అందిపుచ్చుకునే లక్ష్యంతో ఏర్పాటైన ఈ కూటమి దేశాలు తరచుగా సంయుక్త కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది PANEX-21 పేరుతో పుణెలో వీటిని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె.. మహమ్మారితో పాటు ప్రకృతి వైపరీత్యాలను కలసికట్టుగా ఎదుర్కొనేందుకు ప్రాంతీయ దేశాలు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని