Covid impact: బడుల మూతతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం: ప్రపంచ బ్యాంకు

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు భారీస్థాయిలో అభ్యాసన నష్టం వాటిల్లిందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది......

Updated : 13 Dec 2021 16:16 IST

ఆందోళనకర విషయాల వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల మూసివేతతో విద్యార్థులకు భారీస్థాయిలో అభ్యాసన నష్టం వాటిల్లిందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. అక్షల మంది భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని పేర్కొంది. కొవిడ్‌ కారణంగా ఈ తరం విద్యార్థులు ప్రస్తుత విలువ ప్రకారం.. తమ జీవితకాలంలో ఆర్జించే 17 లక్షల కోట్ల డాలర్ల సంపాదనను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. గతేడాది అంచనా వేసిన 10 లక్షల కోట్ల డాలర్ల నష్టానికి మించి ఇది నమోదైనట్లు వెల్లడించింది. ఇది ప్రపంచ జీడీపీలో సుమారు 14 శాతమని వివరించింది. భారత్‌లోని పరిస్థితులపైనా ఇందులో ప్రస్తావించింది.

లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో విద్యారంగంపై పడిన దుష్ప్రభావానికి సంబంధించి ‘స్టేట్‌ ఆఫ్‌ ది గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ క్రైసిస్‌: ఏ పాత్‌ టు రికవరీ రిపోర్ట్‌’ పేరుతో ప్రపంచ బ్యాంకు ఓ నివేదికను విడుదల చేసింది. యునెస్కో, యూనిసెఫ్‌ సహకారంతో రూపొందించిన ఈ నివేదికలో పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

* కరోనాకు ముందు అల్ప, మధ్య ఆదాయ దేశాల్లోని 53 శాతం మంది విద్యార్థులు విద్యావకాశాలకు దూరంగా ఉండగా, లాక్‌డౌన్‌లో అది 70 శాతానికి పెరిగింది. దీర్ఘకాలంపాటు పాఠశాలల మూసివేత, ఆన్‌లైన్‌ తరగతులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం.

* కొవిడ్‌ సంక్షోభం మొదలై సుమారు 21 నెలలు గడిచినా.. ఇప్పటికీ పెద్దఎత్తున స్కూళ్లు తెరవకపోవడంతో లక్షల మంది పిల్లలు విద్యాభ్యాసానికి దూరమయ్యారు. ప్రస్తుత తరానికి జరుగుతున్న అభ్యాసన నష్టం వల్ల భవిష్యత్తులో ఉత్పాదకత ఆందోళనకరస్థాయిలో పడిపోనుంది. ఫలితంగా వారి సంపాదనతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం పడనుంది.

* బడులకు దూరం కావడం వల్ల గ్రామీణ భారతంతో పాటు పాకిస్థాన్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, మెక్సికో తదితర దేశాల్లో విద్యార్థులు గణితంతో పాటు చదవడంలోనూ బాగా వెనుకబడ్డారు. విద్యార్థుల అభ్యాసన నష్టానికి.. పాఠశాలల మూసివేతతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు తేలింది. అయితే విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, జెండర్‌ తదితర అంశాలు కూడా అభ్యాసన నష్టం స్థాయి పెరగడానికి కారణమయ్యాయి.

* విద్యారంగానికి ఉపశమనం కలిగించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వాలు ఉద్దీపన ప్యాకేజీల్లో 3 శాతం కంటే తక్కువే కేటాయించాయి. ఆ వాటాను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ప్రపంచంలోని అన్ని దేశాలు తమ విద్యార్థులకు రిమోట్‌ లెర్నింగ్ అవకాశాలను అందిస్తున్నప్పటికీ.. అందులో నాణ్యతను పాటించడం లేదని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అల్పాదాయ, అత్యల్పాదాయ దేశాల్లోని 20 కోట్ల మందికి పైగా విద్యార్థులకు నాణ్యమైన ఆన్‌లైన్‌ బోధన అందలేదని పేర్కొంది. ముందుతరం వారికి సాటిగా.. ప్రస్తుత విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వెంటనే పాఠశాలలను తెరవాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు సూచించింది. విద్యార్థుల సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక బోధన పద్ధతులు అనుసరించాలని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని