
Mansukh Mandaviya: బూస్టర్ డోసు, పిల్లలకు వ్యాక్సిన్లపై కేంద్రం స్పష్టత
దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ భయాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ ప్రారంభించాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పార్లమెంట్ వేదికగా స్పష్టతనిచ్చారు. బూస్టర్ డోసు సహా పిల్లలకు కొవిడ్ టీకాపై నిపుణుల సూచనల మేరకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కరోనా మహమ్మారిపై లోక్సభలో సుదీర్ఘ చర్చ సాగింది. ఈ నేపథ్యంలోనే మాండవీయ మాట్లాడుతూ.. ‘ఎట్ రిస్క్’ దేశాల నుంచి వచ్చిన 16 వేల మంది ప్రయాణికులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించామని, అందులో 18 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు వెల్లడించారు. వారి స్వాబ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామన్నారు. పీఎం కేర్స్ నిధుల ద్వారా సమకూర్చిన వెంటిలేటర్లపై విపక్షాలు విమర్శలు చేయటాన్ని తప్పుపట్టారు మాండవియా. సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ నాయకత్వం గొప్పగా ఉందని కొనియాడారు.
పోరాటాన్ని నీరుగార్చేందుకు విపక్షాల యత్నం
‘58 వేల వెంటిలేటర్ల కోసం ఆర్డర్లు ఇచ్చాం. వీటిలో చాలావరకు ప్రభుత్వ రంగ సంస్థలవే ఉన్నాయి. ఇప్పటివరకు 50,200 శ్వాస సంబంధింత యంత్రాలను రాష్ట్రాలకు సరఫరా చేశాం. వివిధ ఆసుపత్రుల్లో 48 వేల యంత్రాలు ఏర్పాటు చేశారు. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రాలకు అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రధానితో సమావేశం సందర్భంగా ప్రభుత్వానికి సహకరిస్తామని విపక్షాలు, అధికారంలో ఉన్న రాష్ట్రాలు హామీ ఇచ్చాయి. కానీ, ఆ మాటలను నిలబెట్టుకోవడంలేదు. కొవిడ్పై దేశం చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారు’ అంటూ మాండవీయ వ్యాఖ్యానించారు.
50 శాతం మందికి పూర్తిస్థాయిలో టీకా
దేశంలోని అర్హులైన ప్రజలందరికీ పూర్తిస్థాయిలో టీకా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ఇప్పటికే 85 శాతం మంది తొలిడోసు, 50 శాతం మంది పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు తమ నియోజకవర్గాల్లో 100 శాతం పూర్తయేందుకు కృషి చేయాలని లోక్సభ సభ్యులకు ఈ సందర్భంగా సవాల్ చేశారు. ఇప్పటికే రాష్ట్రాల వద్ద 22 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలలో మరో 10 కోట్ల డోసులను అందించనున్నట్లు వెల్లడించారు.
Read latest National - International News and Telugu News