Omicron: ఒమిక్రాన్‌పై భయం వద్దు.. భారతీయులు దీన్ని తట్టుకోగలరు

ఒమిక్రాన్‌ కానీ, మరేదైనా కొత్త వేరియంట్‌ను కానీ తట్టుకునే శక్తి అత్యధిక భారతీయులకు ఉన్నందున ఎవరూ భయాందోళనలు...

Published : 01 Dec 2021 08:25 IST

ప్రముఖ వైరాలజిస్టు జమీల్‌ వెల్లడి

దిల్లీ: ఒమిక్రాన్‌ కానీ, మరేదైనా కొత్త వేరియంట్‌ను కానీ తట్టుకునే శక్తి అత్యధిక భారతీయులకు ఉన్నందున ఎవరూ భయాందోళనలు చెందనక్కర్లేదని సుప్రసిద్ధ వైరాలజిస్ట్‌ డాక్టర్‌ షాహిద్‌ జమీల్‌ భరోసా ఇచ్చారు. అయితే, మాస్కులు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జినోమిక్స్‌ కన్సార్టియా (ఇన్సాకోగ్‌) సలహా సంఘానికి ఆయన గతంలో నాయకత్వం వహించారు. ‘‘భారతదేశంలో కొవిడ్‌ రెండో దశలో డెల్టా వేరియంట్‌ చాలా ఎక్కువ మందికి సోకింది. 67 శాతం మంది భారతీయుల్లో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు జాతీయ సీరో సర్వే సూచించడం దీనికి నిదర్శనం. అంటే దాదాపు 94 కోట్లమంది భారతీయుల్లో యాంటీబాడీలు ఏర్పడ్డాయన్నమాట. అప్పటికి దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్లు వేసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీన్నిబట్టి కొవిడ్‌ సోకడం వల్లే ఎక్కువ మందిలో యాంటీబాడీలు ఉత్పన్నమైనట్లు స్పష్టమవుతోంది’’ అని జమీల్‌ వివరించారు. ఇదే భారతీయులకు ఒమిక్రాన్‌ వంటి వేరియంట్లను తట్టుకునే శక్తిని అందిస్తోందన్నారు. దిల్లీ జనాభాలో 97 శాతం మందికి, ముంబయి జనాభాలో 85-90 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్లు ఇటీవలి సీరో సర్వే తేల్చిందని, కనుక ఒమిక్రాన్‌ కానీ, మరే ఇతర వేరియంట్‌ కానీ తీవ్ర రోగ లక్షణాలు కలిగించలేవని జమీల్‌ వివరించారు.

టీకాలు నిరుపయోగం కావు
ఒమిక్రాన్‌ రకంపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేస్తాయా అని ప్రపంచం ఆందోళన చెందుతోంది. దీనిపై పూర్తి సమాచారం రావడానికి ఇంకా ఒకటీ రెండు వారాలు పట్టవచ్చని జమీల్‌ చెప్పారు. ఒమిక్రాన్‌పై టీకాల సామర్థ్యం కొంత తగ్గినా, అవి బొత్తిగా పనిచేయకుండా పోయే ప్రసక్తి లేదని జమీల్‌ తెలిపారు. వ్యాక్సిన్లు కొవిడ్‌ తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. ప్రజలు మాస్కులు ధరిస్తూనే ఉండాలన్నారు. టీకా కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ‘‘అదృష్టవశాత్తు భారత్‌ వద్ద దండిగా టీకాలు ఉన్నాయి. వాటిని జనాభాకు వేగంగా అందించే సామర్థ్యమూ ఉంది. ఒమిక్రాన్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులకు మధ్య వ్యవధిని ఇప్పుడున్న 16 వారాల నుంచి 12 వారాలకు తగ్గించాలి. ముఖ్యంగా పెద్ద వయసువారికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి, వైద్యులు, సహాయక సిబ్బందికి త్వరగా టీకాలు వేయాలి’’ అని పేర్కొన్నారు.

టీకా బూస్టర్‌ డోసుల వల్ల ప్రయోజనం ఉన్నా, అత్యధిక భారతీయులకు వేగంగా రెండు డోసులు వేయడం అంతకన్నా ముఖ్యమని జమీల్‌ ఉద్ఘాటించారు. భారత్‌లో అందుబాటులో ఉన్న టీకాల్లో 90 శాతం కొవిషీల్డేననీ, దాన్ని బూస్టర్‌ డోసుగా ఇవ్వడం వల్ల ప్రయోజనం పరిమితమేనని ఆయన వివరించారు. కాబట్టి బూస్టర్‌ డోసుగా ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ, ప్రోటీన్‌ వ్యాక్సిన్లను ఇవ్వడం మంచిదని సూచించారు. ఒమిక్రాన్‌ 25 ఏళ్ల లోపువారికే ఎక్కువగా సోకుతోందని వార్తల గురించి ప్రశ్నించగా, ఆ విషయమై పూర్తి సమాచారం లేదని చెప్పారు. ఇంతవరకు ఈ వేరియంట్‌ ఎక్కువగా 25 ఏళ్లలోపువారిలోనే కనిపిస్తున్న మాట నిజమే అయినా, చిన్న పిల్లలకు ఈ రకం వల్ల ప్రమాదం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని