Fourth Wave: దక్షిణాఫ్రికాలో నాలుగోవేవ్‌.. 5 రెట్లు పెరిగిన కేసులు!

దక్షిణాఫ్రికాలో కొవిడ్‌ పరీక్ష నిర్వహించిన ప్రతి నలుగురిలో ఒకరికి పాజిటివ్‌గా తేలుతోంది. ముఖ్యంగా కేసులు విపరీతంగా పెరగడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 08 Dec 2021 01:45 IST

కొవిడ్‌ తీవ్రతపై అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఆందోళన

జోహెన్నెస్‌బర్గ్‌: ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులతో దక్షిణాఫ్రికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత మూడు వారాలుగా అక్కడి రోజువారీ కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కొవిడ్‌ పరీక్ష నిర్వహించిన ప్రతి నలుగురిలో దాదాపు ఒకరికి పాజిటివ్‌గా తేలుతోంది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు విపరీతంగా పెరగడం పట్ల ఆ దేశ అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్‌లు వెలుగు చూసిన తరుణంలో కొవిడ్‌ నాలుగోవేవ్‌ కూడా ఊహించినదేనని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడంతోపాటు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

5 రెట్లు పెరిగిన కేసులు..

‘ఒమిక్రాన్‌ వెలుగు చూసిన అనంతరం దక్షిణాఫ్రికాలో వైరస్‌ సంక్రమణ అనూహ్య రీతిలో పెరుగుతోంది. గడిచిన వారం రోజుల్లోనే కేసుల సంఖ్య 5 రెట్లు పెరిగింది. రెండు వారాల క్రితం కొవిడ్‌ పాజిటివిటీ రేటు 2శాతం ఉండగా.. ప్రస్తుతం అది 25 శాతానికి చేరుకుంది. ఇలా దేశంలో కొవిడ్‌ నాలుగోవేవ్‌ ఎదుర్కొంటున్న దశలో ఇన్‌ఫెక్షన్‌ రేటు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్యరంగ నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు’ అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా పేర్కొన్నారు. దేశంలో వైరస్‌ తీవ్రత పెరిగిన సందర్భంగా దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. కొవిడ్‌ ఆంక్షలను మరింత కఠినతరం చేసే అంశంపై కొవిడ్‌పై జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నేషనల్‌ కరోనావైరస్‌ కమాండ్‌ కౌన్సిల్‌ త్వరలోనే సమావేశమవుతుందని వివరించారు.

వ్యాక్సిన్‌తోనే అడ్డుకట్ట..

కొత్తగా బయటపడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ సంక్రమణ, దాని తీవ్రత తెలుసుకునేందుకు దక్షిణాఫ్రికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారని వెల్లడించారు. వీటితోపాటు ఈ వేరియంట్‌ను వ్యాక్సిన్‌లు ఎంతమేరకు ఎదుర్కొంటాయి? వ్యాధి తీవ్రతకు ఈ వేరియంట్‌ కారణమవుతుందా? అనే కోణంలోనూ నిపుణులు పరిశోధనలు జరుపుతున్నారని అన్నారు. ఇప్పటివరకు ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం, ప్రస్తుతం కేవలం వ్యాక్సిన్‌ మాత్రమే కొత్త ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయగలవని చెబుతున్నాయన్నారు. అంతేకాకుండా వ్యాధి తీవ్రతను తగ్గించడంతోపాటు ఆస్పత్రుల్లో చేరిక, మరణం ముప్పు నుంచి వ్యాక్సిన్‌లు తప్పిస్తాయని రామఫోసా స్పష్టం చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ వేరియంట్‌కు సంబంధించి అదనపు సమాచారం తెలుస్తుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలాఉంటే, దక్షిణాఫ్రికాలో రెండువారాల క్రితం నిత్యం వందల సంఖ్యలో వెలుగుచూసిన పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రస్తుతం 10వేలు దాటింది. డిసెంబర్‌ తొలివారంలో రోజువారీ కేసుల సంఖ్య 16వేలకు చేరింది. అక్కడి జాతీయ అంటువ్యాధుల కేంద్రం గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య 86 వేలు దాటింది. రానున్న మరికొన్ని రోజుల్లోనే ఈ సంఖ్య గణనీయంగా పెరగనున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని