America: కరోనా పోరులో ‘తప్పు మార్గం’లో వెళుతోంది!

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో అమెరికా ప్రస్తుతం ‘తప్పు మార్గం’లో వెళుతోందని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 26 Jul 2021 02:02 IST

అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ హెచ్చరిక

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో అమెరికా ప్రస్తుతం ‘తప్పు మార్గం’లో వెళుతోందని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ మందగించడంతోపాటు డెల్టా వేరియంట్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించడం పట్ల అమెరికా అధికారులను డాక్టర్‌ ఫౌచీ మరోసారి హెచ్చరించారు.

‘దేశంలో ఇంకా సగం మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేదు. ఇది అమెరికాకు పెద్ద సమస్య. రానున్న రోజుల్లో కొవిడ్‌ మరణాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం తప్పు మార్గంలో వెళుతున్నామని తెలుస్తోంది’ అని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా మాస్కు తప్పనిసరి ధరించాలని లాస్‌ఏంజిల్స్‌, సెయింట్‌ లూయిస్‌ రాష్ట్రాలు ఆదేశాలు జారీచేయడాన్ని ఫౌచీ సమర్థించారు. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తులు మాస్కులు ధరించనవసరం లేదని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) మార్గదర్శకాలు జారీ చేయడం పట్ల ఆంటోని ఫౌచీ ఈ విధంగా స్పందించారు.

అమెరికాలో మాస్కులు ధరించడంపై సీడీసీ మినహాయింపు ఇవ్వడాన్ని పలువురు సమర్థిస్తున్నప్పటికీ వైద్యరంగ నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ వంటి కొత్త రకాలు వెలుగు చూస్తోన్న వేళ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉంటే, అమెరికాలో ప్రస్తుతం నమోదవుతున్న కొత్త కేసుల్లో దాదాపు 80శాతానికిపైగా డెల్టా వంటి కొత్త వేరియంట్లకు చెందిన కేసులే ఉన్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా కొత్త వేరియంట్లపై ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాలు ఏమేరకు సమర్థత కలిగి ఉన్నాయనేది కచ్చితంగా తెలియని నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు