Rameswar Teli: కరోనా టీకా ఉచితంగా ఇస్తున్నాంగా..అందుకే ఇంధన ధరలు పెరుగుతున్నాయి..!

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ, సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలపై పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిని ప్రశ్నించగా.. వివాదాస్పదంగా స్పందించారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని అన్నారు. 

Published : 11 Oct 2021 20:51 IST

కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

దిల్లీ: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూ, సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ ధరల పెరుగుదలపై పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిని ప్రశ్నించగా.. ఆయన చెప్పిన సమాధానం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తోన్న కరోనా టీకాల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయని అన్నారు. 

‘పెట్రోల్ అంత ఖరీదైనది కాదు. కేంద్రం, రాష్ట్రాలు దానిపై పన్నులు విధించాయి. మరోపక్క ప్రభుత్వం ప్రజలందరికి కరోనా టీకాలు ఉచితంగా అందిస్తోంది. మీరు చెల్లించకుండా టీకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పన్నుల నుంచే టీకా డబ్బులు వచ్చాయి. ఈ ప్రభుత్వం 130 కోట్ల మందికి ఉచితంగా టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో టీకా డోసు ధర రూ.1,200. ఒక్కొక్కరికి రెండు డోసులు వేయాలి’ అని మంత్రి చెప్పుకొచ్చారు. 

అలాగే హిమాలయన్ మంచినీళ్లకు పెట్రోల్‌కు పోలిక పెడుతూ మరో వివరణ ఇచ్చారు. ‘మీరు హిమాలయన్ మంచినీళ్లు తాగాలంటే ఒక బాటిల్‌కు రూ.100 వెచ్చించాలి. పెట్రోల్ కంటే దాని ధరే ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగితే, అందుకు తగ్గట్టే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి.  మా మంత్రిత్వ శాఖ ఈ ధరల్ని నియంత్రించలేదు. అది వాణిజ్య శాఖ పరిధిలోని విషయం’ అని అన్నారు. 

గత కొద్దికాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. సోమవారం లీటర్‌ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల వరకు పెరిగింది. దాంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చమురు ధరలు 100 మార్కును దాటడంతో ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని