Precaution Dose: రెండోడోసు తర్వాత ఎన్ని నెలలకు ‘ముందు జాగ్రత్త డోసు..’?

రెండోడోసు తీసుకున్న తర్వాత 9 నుంచి 12 నెలలు మధ్యకాలంలోనే ఈ ప్రికాషినరీ డోసు ఇచ్చే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Published : 26 Dec 2021 16:22 IST

కసరత్తు చేస్తోన్న నిపుణుల బృందం

దిల్లీ: దేశంలో కొత్తరకం వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. దీంతో 60ఏళ్ల వయసు దాటి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ‘ముందుజాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ అందిస్తామని ప్రకటించింది. అయితే, రెండోడోసు తీసుకున్న తర్వాత దీనిని ఎప్పుడు ఇస్తారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రెండో డోసు తీసుకున్న 9 నుంచి 12 నెలలు మధ్యకాలంలోనే ఈ ప్రికాషినరీ డోసు ఇచ్చే అవకాశాలున్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

‘రెండో డోసు, ప్రికాషన్‌ డోసు మధ్య 9 నుంచి 12 నెలల వ్యవధి ఉండే అవకాశం ఉంది. దీనిపై ఇమ్యూనైజేషన్‌ విభాగం, ఇమ్యూనైజేషన్‌పై జాతీయ సాంకేతిక సలహాబృందం (NTAGI)లు చర్చిస్తున్నాయి’ అని కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు దేశంలో విస్తృత వినియోగంలో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిపైనా కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే వీటిపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.

దేశంలో వేగంగా సంక్రమిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌, కొవిడ్‌ తీవ్రతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సంద్భంగా 15-18 ఏళ్ల వయసు వారికి కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 3న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ విస్తృతి నేపథ్యంలో భయపడాల్సిన పని లేకపోయినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే 60 ఏళ్ల వయసు దాటి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారికి వైద్యుల సలహాపై ‘ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోసు’ టీకా అందిస్తామన్నారు. ఆరోగ్య విభాగ సిబ్బందికి దీన్ని జనవరి 10 నుంచి వేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు వివిధ దేశాల్లో ఇస్తోన్న మూడో డోసును బూస్టర్‌ డోసుగా పరిగణిస్తున్నప్పటికీ.. ప్రధాని మోదీ మాత్రం దీన్ని ‘ప్రికాషన్‌ డోసు’గా పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, దేశంలో ఇప్పటికే 90 శాతం అర్హులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలిడోసు అందగా.. 61 శాతం మందికి పూర్తి మోతాదుల్లో అందింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32లక్షల డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 141కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని