
Booster Dose: యాంటీబాడీలు తగ్గినా.. టీ కణాల భరోసా..!
శాస్త్రీయ ఆధారంగానే బూస్టర్ డోసుపై నిర్ణయమన్న కేంద్రం
దిల్లీ: కొత్తరకం వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండడంతో బూస్టర్ డోసుపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బూస్టర్ అంశంపై మరోసారి స్పందించింది. బూస్టర్ డోసు ఆవశ్యకతపై భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఫలితాలపై కేంద్రప్రభుత్వ శాస్త్రీయ విభాగాలు సంప్రదింపులు, సమీక్ష జరుపుతున్నాయని స్పష్టం చేసింది. ఇప్పటికే కొవిడ్ వర్కింగ్ గ్రూపు, వ్యాక్సినేషన్పై సాంకేతిక సలహా బృందం (NTAGI) పలుమార్లు చర్చించాయని తెలిపింది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం బూస్టర్ డోసు పంపిణీపై ఓ విధానాన్ని రూపొందిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
శాస్త్రీయ ఆధారాల ప్రకారమే..
‘బూస్టర్ అంశంపై ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిపిన కొవిడ్ వర్కింగ్ గ్రూప్.. వ్యాక్సినేషన్పై జాతీయ సాంకేతిక సలహా బృందానికి (NTAGI) సిఫార్సులు చేస్తుంది. అనంతరం అవి ప్రధాన సాంకేతిక బృందానికి వెళ్తాయి. అక్కడ నుంచి నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్ (NEGVAC)కు చేరుతుంది. తర్వాత దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ వెల్లడించారు. అందుకే వీటికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని సమీక్షించి ఓ విధానాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా బూస్టర్ డోసుల అవసరం, ఏ సమయంలో ఇవ్వాలనే దాన్ని శాస్త్రీయ ఆధారాలబట్టే నిర్ణయిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘కేవలం బూస్టర్ డోసును ఇవ్వడం వల్ల ఏ దేశం కూడా మహమ్మారిని జయించలేదు’ అని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.
యాంటీబాడీలు తగ్గినా..
కొత్త వేరియంట్లను తటస్థీకరించే యాంటీబాడీలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ టీ-కణాలు మాత్రం క్రియాశీలంగానే ఉంటున్న విషయాన్ని రాజేష్ భూషణ్ గుర్తు చేశారు. వాస్తవంగా మనకు కావల్సింది కూడా అదేనని ఆయన స్పష్టం చేశారు. ‘కొంతకాలానికి యాంటీబాడీ రక్షణ క్షీణిస్తున్నప్పటికీ టీ కణాలపై భరోసా ఉంది. రోగనిరోధక ప్రతిస్పందనలో సెకండ్ పిల్లర్గా ఉండే ఇవి.. తీవ్ర వ్యాధి బారిన పడకుండా రక్షించగలవు’ అని డబ్ల్యూహెచ్ఓ నిపుణుడు అబ్ది మహమూద్ చెప్పిన మాటలను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి మరోసారి ప్రస్తావించారు. అందుకే బూస్టర్ డోసులపై శాస్త్రీయ ఆధారాల ప్రకారం నిపుణుల కమిటీలు ఇచ్చే సిఫార్సుల బట్టి తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.