Coronavirus: మహారాష్ట్రలో 10 మంది మంత్రులు..20 మంది ఎమ్మెల్యేలకు కరోనా!

మహారాష్ట్రలో 10 మంది మంత్రులకు పైగా కరోనా బారిన పడ్డారు. మరో 20 మంది ఎమ్మెల్యేలకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వెల్లడించారు....

Updated : 01 Jan 2022 14:08 IST

ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వెల్లడి

పుణె: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే ప్రజాప్రతినిధులు కూడా ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు.. మరో 20 మందికిపైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరించారు.

శుక్రవారం మహారాష్ట్రలో 8,067 కొత్త కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసుల సంఖ్యలో 50 శాతం వృద్ధి రికార్డయ్యింది. ఈ నేపథ్యంలోనే పవార్‌ హెచ్చరించాల్సి వచ్చింది. కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధాని మోదీ సైతం ప్రజలను ఇదే కోరారని గుర్తుచేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూలు విధించారని పేర్కొన్నారు. ముంబయి, పుణెలో కేసులు అత్యధికంగా ఉన్నాయని వెల్లడించారు.

ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోందని పవార్‌ తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు అనివార్యమని తెలిపారు. ఆంక్షల నుంచి తప్పించుకోవాలంటే ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలను తు.చ. తప్పుకుండా పాటించాలని సూచించారు. ఇప్పటికే జనసమూహాలపై మహారాష్ట్ర సర్కార్‌ ఆంక్షలు విధించింది.

2021 చివరి 12 రోజుల్లో మహారాష్ట్రలో రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ముంబయిలో శుక్రవారం 5,631 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే 2,000 కేసులు అధికంగా నిర్ధారణ అయ్యాయి. దీంతో నగరంలో కేసులు 7,85,110కి చేరాయి. ఇక పుణెలో పాజిటివిటీ రేటు 5.9 శాతం పెరిగింది. శుక్రవారం కొత్తగా 412 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ నగరంలో కేసుల సంఖ్య 5,10,218కి చేరింది.

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ ప్రభావం కొత్త కేసులపై స్పష్టంగా కన్పిస్తోంది. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 22వేలు దాటగా.. 400 మందికి పైగా మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఒమిక్రాన్‌ కేసులు  సంఖ్య 1431కు చేరింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 200 కేసులు పెరగడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్‌ సోకగా.. దిల్లీలో 351 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని