India Corona : 8 వేలకు దిగువనే కొత్త కేసులు..

దేశంలో కొవిడ్‌ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ.. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళనకు గురిచేస్తోంది.

Updated : 12 Dec 2021 11:52 IST

దేశంలో కలవరపెడుతోన్న ఒమిక్రాన్‌


దిల్లీ : దేశంలో కొవిడ్‌ వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ.. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళనకు గురిచేస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 8 వేల లోపు నమోదు కాగా.. మరణాల సంఖ్య 300 దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..

* దేశవ్యాప్తంగా నిన్న 11,89,459 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..  7,774 కేసులు వెలుగులోకి వచ్చాయి.

నిన్న కొవిడ్‌తో పోరాడుతూ 306 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,75,434కి చేరింది.

ఇక కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 8,464 మంది కొవిడ్‌ను జయించగా.. ఇప్పటి వరకూ కోలకున్న వారి సంఖ్య 3.41 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.36 శాతానికి చేరింది.

ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 92,281కి చేరి.. ఆ రేటు 0.27 శాతానికి పడిపోయింది.

* ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 89,56,784 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ అందించిన డోసుల సంఖ్య 132 కోట్లు దాటింది.

33కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు

ప్రపంచదేశాలను కలవరపెడుతోన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. భారత్‌లో క్రమంగా విస్తరిస్తోంది. నిన్న దేశ రాజధాని దిల్లీలో ఈ వేరియంట్‌ రెండో కేసు నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 33కు చేరింది.

రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
మరోవైపు దేశంలోని పలు జిల్లాల్లో కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కొవిడ్‌ పరిస్థితిపై కట్టుదిట్టమైన నిఘా ఉంచి జిల్లాస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించింది. పాజిటివిటీ రేటు 10% దాటినా.. 60 శాతానికి పైగా ఆసుపత్రి పడకలు నిండినా.. అలాంటి జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ సహా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని