India Corona: లక్ష దిగువకు క్రియాశీల కేసులు 

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసుల సంఖ్య అదుపులోనే ఉండటంతో.. క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా లక్ష దిగువకు చేరి ఊరటనిస్తున్నాయి.

Published : 01 Dec 2021 09:57 IST

కొత్తగా 8,954 కరోనా కేసులు.. 267 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసుల సంఖ్య అదుపులోనే ఉండటంతో.. క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా లక్ష దిగువకు చేరి ఊరటనిస్తున్నాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. ఒకపక్క కరోనా గణాంకాలు సానుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ ఆందోళన కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రజలు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

మంగళవారం 11,08,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,954 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కొత్త కేసులు 10వేలకు దిగువనే ఉన్నప్పటికీ.. ముందురోజు కంటే పెరిగాయి. 10,207 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం క్రియాశీల కేసులు సంఖ్య 99,023(0.29 శాతం)కి చేరింది.

దేశవ్యాప్తంగా 3.45 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 3.40 కోట్ల మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.36 శాతానికి పెరిగింది. గతేడాది మార్చి నుంచి ఇదే అత్యధికం. 24 గంటల వ్యవధిలో 267 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో మరణాల సంఖ్య 177గా ఉంది. మొత్తంగా 4,69,247 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. మరోపక్క నిన్న 80,98,716 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు 124 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని