Omicron: దేశంలో 145కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్​లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది......

Published : 19 Dec 2021 17:28 IST

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్​లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 145కు చేరింది. బ్రిటన్​ నుంచి ఆదివారం గుజరాత్​కు వచ్చిన ఓ వ్యక్తి (45) సహా బాలుడిలో ఒమిక్రాన్ వేరియంట్​ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ఇద్దరిని అహ్మదాబాద్​లోని ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు.

కేంద్రం, రాష్ట్రాల గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులను ప్రభుత్వాలు గుర్తించాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 48 కేసులు బయటపడ్డాయి. దిల్లీలో 22, తెలంగాణ 20, రాజస్థాన్​ 17, కర్ణాటక 14, కేరళ 11,  గుజరాత్​ 9, ఆంధ్రప్రదేశ్, చంఢీగఢ్​, తమిళనాడు, బెంగాల్​లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ నిర్ధరణ అయిన 48 మందిలో 28 మంది ఇప్పటికే  కోలుకుని ఇళ్లకు వెళ్లారని అధికారులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తోంది. 89 దేశాల్లో ఈ వేరియంట్​ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. డెల్టా వేరియంట్ కన్నా.. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపింది. 1.5 నుంచి 3 రోజుల వ్యవధిలోనే వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే రోగ నిరోధకశక్తిపై ఈ వేరియంట్​ ఎంతమేర ప్రభావం చూపిస్తుందన్న దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని