Covid-19 : చిన్నారులకు టీకాలు సురక్షితమేనా..?

చిన్నారులకు వ్యాక్సిన్‌ సురక్షితమేనని అమెరికా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

Updated : 02 Jan 2022 16:03 IST

వాస్తవ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..

వాషింగ్టన్‌: కొవిడ్‌-19ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. వైరస్‌ను నిరోధించడంలో ఈ టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని ఇప్పటికే అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నారులకూ వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమాన్ని పలు దేశాలు మొదలుపెట్టాయి. దీంతో అసలు చిన్నారులకు కొవిడ్‌ టీకాలు సురక్షితమేనా అనే అనుమానాలు, భయాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌లు అత్యంత సురక్షితమేనని అమెరికాలో వాస్తవ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికాలో 12 నుంచి 17ఏళ్ల మధ్య వయసున్న లక్షల మంది పిల్లలకు ఇప్పటికే ఫైజర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వీరితోపాటు 5 నుంచి 11ఏళ్ల చిన్నారులకు ఈ నవంబర్‌ నుంచే ఫైజర్‌ పంపిణీని మొదలుపెట్టారు. ఇప్పటికే 50లక్షల మందికి తొలిడోసును అందించారు. ఇప్పటివరకు వారిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని వ్యాక్సిన్‌లపై అక్కడి ప్రభుత్వ పర్యవేక్షణ విభాగం స్పష్టం చేసింది. 12ఏళ్ల వయసువారికి సాధారణ డోసు ఇస్తుండగా.. ఐదేళ్ల వయసు పైబడిన వారికి మాత్రం పెద్దవారితో పోలిస్తే స్వల్ప మోతాదులోనే అందిస్తున్నారు. ఇలా 3100 వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సమాచారాన్ని అమెరికా ఆహార, ఔషధ సంస్థ (FDA) విశ్లేషించింది. చిన్నారుల్లో కొవిడ్‌-19ను నిరోధించడంలో వ్యాక్సిన్‌ 91శాతం సమర్థత చూపిస్తోందని వెల్లడించింది. ముఖ్యంగా యువకుల మాదిరిగానే చిన్నారుల్లోనూ కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించింది. తద్వారా చిన్నారులకు కొవిడ్‌ టీకాలు సురక్షితమనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.

దుష్ర్పభావాలు స్వల్పమే..

వ్యాక్సిన్‌ తీసుకున్న చిన్నారుల్లో దుష్ప్రభావాలపై దృష్టి పెట్టిన నిపుణులు.. కొందరిలో మాత్రమే జ్వరం, టీకా తీసుకున్న చోట నొప్పి వంటి సమస్యలు కనిపిస్తున్నాయని గుర్తించారు. ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్‌ తీసుకున్న చిన్నారుల గుండెలో వాపు రావడం (Myocarditis) అత్యంత అరుదేనని నిపుణులు స్పష్టం చేశారు. ఐదు నుంచి 12ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం ఇటువంటి ముప్పు అసలే లేదని వెల్లడించారు. కేవలం రెండో డోసు తీసుకున్న తర్వాత కొంతమంది యువకుల్లో మాత్రమే ఇటువంటివి కనిపించాయని అయినప్పటికీ వారు త్వరగానే కోటుకుంటున్నట్లు తెలిపారు. ఇటువంటి స్వల్ప ముప్పుతో పోలిస్తే వ్యాక్సిన్‌ వల్ల కలిగే ప్రయోజనాలే అధికమని అమెరికా నిపుణులు ఉద్ఘాటించారు. ఇప్పటికే వీటిపై ఉన్న సమాచారాన్ని అమెరికాలోని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) కూడా విశ్లేషిస్తోంది. ఏదేమైనా వ్యాక్సిన్‌ల వల్ల యువకులకు, చిన్నారులకు ఎటువంటి ముప్పు లేదని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన చిన్నారుల హృద్రోగ నిపుణులు డాక్టర్‌ మ్యాథ్యూ ఒస్టర్‌ స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే, భారత్‌లో ఇప్పటికే అర్హులైన వారిలో 89శాతం మందికి తొలిడోసు అందించగా.. 60శాతం మందికి పూర్తి మోతాదులో కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించారు. త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. భారత్‌లో చిన్నారులపై జరిపిన ప్రయోగాల్లోనూ ఇవి సురక్షితమని తేలడంతో వీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని