Israel Drill: మరో రూపంలో మహమ్మారి ముంచుకొస్తే..?

ఒకవేళ కొత్త రూపంలో లేదా మరో ప్రాణాంతక వైరస్‌ విజృంభిస్తే ఎదుర్కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో తెలుసుకునేందుకు ‘ఒమేగా డ్రిల్‌ (Omega Drill)’ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కొవిడ్‌ డ్రిల్‌ను నిర్వహించింది.

Published : 11 Nov 2021 20:29 IST

కొవిడ్‌ సంసిద్ధతపై ఇజ్రాయెల్‌ జాతీయస్థాయి డ్రిల్‌

జెరూసలేం: దాదాపు రెండేళ్ల క్రితం ఊహించని రీతిలో వచ్చిపడిన కరోనా వైరస్‌ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో తెలియక అప్పట్లో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. చివరికి వ్యాక్సిన్‌ రాకతో ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ పలు దేశాలు మాత్రం కొవిడ్‌ విలయం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. ఇదే సమయంలో భవిష్యత్తులో ఈ ప్రాణాంతక వేరియంట్‌లు మరోసారి విరుచుకుపడితే పరిస్థితి ఏంటనే విషయంపై పలు దేశాలు ఆలోచనలో పడ్డాయి. ఇందులో భాగంగా ఒకవేళ కొత్త రూపంలో లేదా మరో ప్రాణాంతక వైరస్‌ విజృంభిస్తే ఎదుర్కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నామో తెలుసుకునేందుకు ఇజ్రాయెల్‌ నడుం బిగించింది. కొవిడ్‌ సంసిద్ధతపై ‘ఒమేగా డ్రిల్‌ (Omega Drill)’ పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం జాతీయ స్థాయిలో కొవిడ్‌ డ్రిల్‌ను నిర్వహించింది.

దేశంలో మరోసారి కొవిడ్‌ తరహా వైరస్‌ లేదా కొత్త వేరియంట్‌ రూపంలో కరోనా విరుచుకుపడితే తీసుకునే చర్యలపై ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు చేసే సామర్థ్యం, ఆస్పత్రుల్లో చికిత్సలు, లాక్‌డౌన్‌ విధానాలు, కొత్త వేరియంట్లపై పర్యవేక్షణ, ప్రజలకు ఆర్థిక సహకారం, సరిహద్దుల్లో అనుసరించాల్సిన విధానాలతో పాటు క్వారంటైన్‌ అమలు చేసేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి విలయతాండవం చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్‌ మాత్రం అత్యంత సురక్షితంగా ఉందని ప్రధానమంత్రి నఫ్తాలీ బెన్నెట్‌ పేర్కొన్నారు. ఇదే తరహాలో ప్రజలకు రక్షణ కల్పిస్తూ సాధారణ పరిస్థితులను కొనసాగించడంతోపాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకే ఈ తరహా డ్రిల్‌ను చేపట్టామన్నారు.

ఇదిలాఉంటే, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ముందున్న ఇజ్రాయెల్‌.. బూస్టర్‌ డోసు పంపిణీని ఇప్పటికే మొదలుపెట్టింది. మరోవైపు అక్కడ కొవిడ్‌ తీవ్రత కూడా అదుపులోనే ఉంది. ఆగస్టు నెలలో తీవ్ర కొవిడ్‌ కేసుల సంఖ్య 700 ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 500లకు తగ్గింది. అప్పట్లో రోజువారీ కేసుల సంఖ్య 10వేలు ఉండగా.. ప్రస్తుతం 500లకు తగ్గినట్లు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే 12ఏళ్లకుపైబడిన అర్హులందరకీ రెండు మోతాదుల్లో వ్యాక్సిన్‌ అందించింది. మూడో డోసును మొదలు పెట్టిన ఇజ్రాయెల్‌.. త్వరలోనే 5 నుంచి 11ఏళ్ల వయసు చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని